దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 11 వారాల పాటు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తర్వాత మూడు వారాలుగా కేసులు క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 2,541 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనాతో మరో 30 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 16,522గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,22,223కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు.
వారం కిందటి వరకు దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఢిల్లీ, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు వెలుగు చూశాయి. అయితే వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్ధాన్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. గత వారంలో దేశ రాజధాని ఢిల్లీలో 6,300కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్ కారణంగానే ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయని వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు.