Indian Economy: భారతదేశాన్ని 21వ శతాబ్ధపు ఆర్థిక శక్తిగా మారేందుకు సిద్ధంగా ఉందని, చైనాకి ప్రత్నామ్యాయంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు, సప్లై చైన్ నష్టాలను తగ్గించాలని చూస్తోందని, దీనికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు పారిశ్రామిక వేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎన్ఎన్ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం రాబోయే దశాబ్ధాల్లో దేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా మారుతుందని అన్నారు. రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేల నిర్మాణానికి బిలియన్ కొద్దీ ఖర్చు చేసి మోడీ ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాలను ప్రారంభించిందని నివేదిక పేర్కొంది. మోడీ ప్రభుత్వం డిజిటల్ కనెక్టివిటీని ప్రోత్సహిస్తోందని, ఇది వాణిజ్యం మరియు రోజూవారీ జీవితాన్ని మెరుగుపరుస్తోందని CNN నివేదిక చెప్పింది. దేశంలో ఈ విప్లవానికి శ్రీకారం చుట్టడంలో అదానీ, అంబానీలు కీలకంగా మారారని చెప్పింది.
2023లో 3.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, పీఎం మోడీ 10 ఏళ్ల పదవీ కాలంలో భారత్ నాలుగు స్థానాలు ఎగబాకి యూకేని అధిగమించిన విషయాన్ని నివేదిక వెల్లడించింది. రాబోయే ఏళ్ల కనీసం 6 శాతం వార్షిక వృద్ధిరేటుతో సౌకర్యవంతమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని, అయితే ఆర్థికంగా అగ్రరాజ్యంగా మారాలంటే ఏడాదికి 8 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వృద్ధి రేటను లక్ష్యంగా పెట్టుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారని నివేదిక చెప్పింది. 2027 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలుస్తుందని పరిశీలకుల అంచనాగా చెప్పింది.
అదానీ, రిలయన్స్ గ్రూప్స్ 200 మిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగి ఉన్నాయని, శిలాజఇంధన రంగం, క్లీన్ ఎనర్జీ, మీడియా, టెక్నాలజీల వరకు వ్యాపారాలను స్థాపించాయని సీఎన్ఎన్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అభివృద్ధి కోసం ప్రాధాన్యతనిచ్చిన రంగాలపై పెట్టుబడి పెట్టేవిధంగా ఈ ఇద్దరి సామర్థ్యాన్ని పెట్టుబడిదారులు ప్రోత్సహిస్తున్నారని చెప్పింది. మూడోసారి అధికారంలోకి రావడానికి మోడీ ప్రచారం చేస్తున్నారని చెప్పింది. దక్షిణాసియా దేశం 21వ శతాబ్ధపు ఆర్థిక శక్తిగా మారడానికి సిద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది.
Read Also: Kulgam Encounter: కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరో ఎన్కౌంటర్..
పీఎం మోడీ, అంబానీ, అదానీ ఈ ముగ్గురు రాబోయే దశాబ్ధాల్లో భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రాథమిక పాత్ర పోషిస్తున్నారని నివేదిక పేర్కొంది. అమెరికా యొక్క మొదటి బిలియనీర్గా మారిన జాన్ డి రాక్ఫెల్లర్తో అదానీ, అంబానీలను పోలుస్తారని వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ దక్షిణకొరియా, చైనాలు ఆర్థికంగా వెలిగిన గిల్డెల్ ఏజ్లో భారత్ ఉందని చెప్పింది. అంబానీ యాంటిలియా ఇళ్లు గురించి, ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గురించి సీఎన్ఎన్ ప్రస్తావించింది.
స్విట్జర్లాండ్లోని సెయింట్ గాలెన్ విశ్వవిద్యాలయంలో మాక్రో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గైడో కోజ్జీ మాట్లాడుతూ, ఈ కంపెనీలు చాలా ముఖ్యమైనవిగా, బాగా కనెక్ట్ చేయబడ్డాయని అని చెప్పారు. ఈ రెండు ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రావడానికి ముందే స్థాపించబడ్డాయని చెప్పారు. ఈ రెండు కూడా సాధారణ స్తబ్ధత కలిగిన గుత్తాధిపత్య సంస్థలు కావని ఇవి చాలా డైనమిక్ అని అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడంలో ఈ ఇద్దరు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, ప్రత్యక్షంగా ఆర్థిక వృద్ధికి సహకరిస్తున్నట్లు, డిజిటల్ ఆవిష్కరణల ద్వారా కనెక్టవిటీని పెంచడం ద్వారా పరోక్షంగా విస్తరించడానికి సహాయపడుతున్నారని వివరించారు. ముఖేష్ అంబానీ ఒక దశాబ్ధం కన్నా తక్కువ కాలంలో ఇండియా టెలికాం రంగాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా మీడియా నుంచి రిటైల్ వరకు అగ్రగామిగా మారారని, అదానీ ఓడరేవులు, ఎనర్జీ, రక్షణ, అంతరిక్ష వరకు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని నివేదిక ప్రస్తావించింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
వృద్ధిరేటు పరంగా భారత్ విజయం సాధించినప్పటికీ, పెరుగుతున్న యువత నిరుద్యోగం, అసమానతలు సమస్యలుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2022లో ప్రపంచబ్యాంకు ప్రకారం జీడీపీ పర్ ఫర్సన్ విషయంలో భారత్ 147వ స్థానంలో ఉందని చెప్పింది. ఇది జీవనప్రమాణాలకు కొలమానం.