భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును నిర్వాహకులు ప్రదానం చేశారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోదీకి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోంస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
కాగా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకుంటూ ప్రధాని మోదీ లతా మంగేష్కర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. లతా దీదీ తనకు అక్క వంటిది అని.. ఆమె సరస్వతీ దేవికి ప్రతిరూపం అని మోదీ అభిప్రాయపడ్డారు. సంగీతం దేశభక్తిని ప్రబోధిస్తుందని.. లతా మంగేష్కర్ స్వరంలో దేశభక్తి పరవళ్లు తొక్కేదని కొనియాడారు. ఈ సందర్భంగా ఇంతటి ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాగా లతా మంగేష్కర్ (92) ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో అస్వస్థతతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
PM Narendra Modi: జమ్మూ కాశ్మీర్లో రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించాం