నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన క్షిపణి ప్రయోగాలకు మరోసారి పనిచెప్పాడు. ఈ రోజు తెల్లవారుజామున వరసగా 3 క్షిపణులను ప్రయోగించాడు. క్షిపణి ప్రయోగాల్లో తగ్గేదే లేదంటున్నాడు. ఉత్తర కొరియ క్షిపణి ప్రయోగాలతో జపాన్, దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మూడు క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించింది నార్త్ కొరియా. ఈ విషయాన్ని సియోల్ మిలటరీ ధ్రువీకరించింది. సునమ్ ప్రాంతం నుంచి మూడు క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరయి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ వెల్లడించింది.
జపాన్ ప్రభుత్వం కూడా ఆ దేశ కోస్ట్ గార్డ్ ను హెచ్చరించింది. సముద్రంలో పడే వస్తువులకు దూరంగా ఉండాలని సూచించింది. నీటిలో పడిపోయిన వస్తువులకు కోస్ట్ గార్డ్ నౌకలు దూరంగా వెళ్లాలని ఆదేశించింది. జపాన్ ప్రధాని కిషిడా కూడా నార్త్ కొరియా ప్రయోగంపై స్పందించారు. ఈ ప్రయోగాన్ని జపాన్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు.నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం నేపథ్యంలో దక్షిణ కొరియా హై అలెర్ట్ ప్రకటించింది. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసరంగా జాతీయ భద్రత మండలిలో సమావేశం అయ్యారు. ఈ ఏడాది వరసగా నార్త్ కొరియా క్షిపణులను ప్రయోగిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు క్వాడ్ మీటింగ్ కోసం జపాన్ వెళ్లి..తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ ప్రయోగాలను చేపట్టింది నార్త్ కొరియా. అమెరికాకు స్పష్టమైన సంకేతాలను పంపింది. అయితే ఈ ప్రయోగాలపై అమెరికా స్పందించింది. ఉత్తర కొరియా చేసే ఏ పనికైనా అమెరికా సిద్ధంగా ఉందని బైడెన్ అన్నారు. ఉత్తర కొరియాలో కరోనా వేరియంట్ ఓమిక్రాన్ తీవ్రత పెరుగుతున్నా… కిమ్ మాత్రం తన పనిలో బిజీగా ఉన్నాడు. క్షిపణి ప్రయోగాలతో ప్రపంచాన్ని భయపెడుతున్నారు. ఇటీవల కాలంలో దీర్ఘకాలం పని చేయకుండా ఉన్న ఓ అణు రియాక్టర్ ని పున:ప్రారంభించినట్లు తెలుస్తోంది. దేశంలో 25 మిలియన్ల మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఇటీవల జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా విధించాడు అధ్యక్షుడు కిమ్.