‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి దీనిని నిర్మించారు. తొలుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను దర్శక నిర్మాతలు విడుదల చేయాలని భావించారు. అయితే సంక్రాంతి బరి నుండి పెద్ద చిత్రాలు ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ తప్పుకోవడంతో ఆ సీజన్ ను ఉపయోగించుకోవాలనే ఆశతో సినిమా విడుదల తేదీని 15వ తేదీకి మార్చారు. కానీ ఇప్పుడు ఏపీలో థియేటర్లు యాభై శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండటం, కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో మరోసారి వారు తమ నిర్ణయం మార్చుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తమ ‘ఉనికి’ చిత్రాన్ని జనవరి 21న విడుదల చేస్తామని తెలిపారు.
‘ఉనికి’ కథ గురించి నిర్మాతలు చెబుతూ, ”సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక యువతి, కష్టపడి చదివి కలెక్టర్ అవుతుంది. సమాజానికి మంచి చేయాలని ముందుకొచ్చిన ఆవిడకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించి తన ‘ఉనికి’ని ఎలా చాటుకుంది? అనేది సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఇది ఉంటుంది” అని అన్నారు. ఈ చిత్రంలో టీఎన్ఆర్, ‘రంగస్థలం’ నాగ మహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు, పద్మశ్రీ, బండి స్టార్ కిరణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.