కూటమిగా ప్రజల్లోకి వెళ్లాల్సిన పార్టీల మధ్య కుంపట్ల రాజుకుంటున్నాయా..? పైకి కన్పించని అగాధమేదో లోలోపల పెరిగిపోతోందా? మోడీ పేరును వాడుకోవడం లేదని బీజేపీ ఫీలవుతుంటే…. ఆ వివాదాలు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనని టీడీపీ, జనసేన భయపడుతున్నాయా? ముస్లిం రిజర్వేషన్స్ తుట్టెను కదిపితే… మొదటికే మోసం వస్తుందని గ్లాస్, సైకిల్ భయపడుతున్నాయా? పోలింగ్ ముంగిట్లో జరగబోతున్న పరిణామాలేంటి? లెట్స్ వాచ్. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య పైకి కనిపించనిది ఏదో జరుగుతోందా? అంటే అవును నిజమే కావచ్చన్నది రాజకీయ వర్గాల మాట. మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి బీజేపీ హాజరైనా.. మేనిఫెస్టోకు మా మద్దతు ఉందని చెప్పినా….. అవన్నీ పైపై మాటలేనని, అంతకు మించి లోలోపల ఇంకేదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయట. మరీ ముఖ్యంగా వైసీపీ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఊదరగొట్టేస్తోంది. వైసీపీ నేతలతో పాటు ఏకంగా సీఎం కూడా టీడీపీ-జనసేన మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉందన్న కామెంట్స్ చేశారు. దీని ద్వారా టీడీపీ-జనసేన మేనిఫెస్టోకు అంతగా ఆదరణ లేదని, బీజేపీ కావాలనే దూరంగా ఉందన్న ప్రచారాన్ని మొదలుపెట్టింది వైసీపీ. దీనికి టీడీపీ నేతలతో పాటు.. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సిద్దార్ద్ నాధ్ సింగ్ కూడా కౌంటర్లు ఇచ్చారు. కానీ వైసీపీ మాత్రం ఆ లైన్ను వదలకుండా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో కూటమి పార్టీల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం తెర పైకి వస్తోంది.మరీ ముఖ్యంగా బీజేపీ-టీడీపీల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ముస్లిం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ చేస్తున్న కామెంట్స్ ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో కన్పిస్తోందంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో మైనార్టీల ప్రభావం చూపే నియోజకవర్గాలు 60దాకా ఉంటాయని, ఇలాంటి సమయంలో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లు తమకు ఇబ్బందిగా మారతాయని టీడీపీ భయపడుతోందని అంచనా వేస్తున్నాయట వైసీపీ వర్గాలు. ఇదే అంశంపై విస్తృతంగా ప్రచారం చేపట్టడంతో పాటు.. సోషల్ మీడియాలోనూ అదే పనిగా పోస్ట్లు పెట్టి వీళ్ల మధ్యన గ్యాప్ ఉందనే అంశాన్ని ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. కొంత కాలంగా ఈ ప్రచారం చేపడుతుండగా.. మేనిఫెస్టో విషయంలో జరిగిన పరిణామాలను బేస్ చేసుకుని ఇప్పుడీ అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. మరోవైపు బీజేపీ కూడా టీడీపీ నేతలు.. మరీ ముఖ్యంగా చంద్రబాబు తీరు మీద గుర్రుగా ఉందనే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కాలంలో ఇటు చంద్రబాబు కానీ.. అటు పవన్ కళ్యాణ్ కానీ మోడీ గురించి.. బీజేపీ జాతీయ నాయకత్వం గురించి ప్రచారంలో పెద్దగా ప్రస్తావించడం లేదట.
వారి వారి సభల్లో మోడీ పేరును అంతగా తీసుకురావడం లేదట. ఇదే బీజేపీ అగ్ర నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అడపా దడపా మోడీని ప్రస్తావిచడం కాదు.. చాలా ఎక్కువగా చెప్పాలి.. మోడీకి అద్భుతమైన ఇమేజ్ ఉన్నా.. ఆ ఇమేజీని పూర్తి స్థాయిలో టీడీపీ-జనసేన వాడుకోవడం లేదన్న చర్చ జరుగుతోందట బీజేపీ వర్గాల్లో. అదే విషయాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోన్నట్టు సమాచారం. అలా చెప్పడం ద్వారా కూటమిలో కనిపించని అగాధం ఉందన్న విషయాన్ని గట్టిగా చెప్పాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే కూటమిలో కుంపట్లు రగిలాయనే కోణాన్ని బలంగా వివిధ వేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వైసీపీ.. పోలింగ్కు ముందు మరింత ఎగ్రెసివ్గా వెళ్లాలని.. కూటమి పార్టీల మధ్య కుంపట్లు రాజుకున్నాయనే ప్రచారాన్ని గట్టిగా చేసి లబ్ది పొందాలనుకుంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అటు ఈ తరహా ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఇటు టీడీపీ కానీ.. జనసేన కానీ పూర్తి స్థాయిలో విఫలమవుతున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు. తాము కలిసే ఉన్నామని.. గ్యాప్ ఎంత మాత్రం లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కూటమి పార్టీలు విఫలమవుతున్నాయన్న వాదన బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఓట్ ట్రాన్స్ఫర్ సవ్యంగా జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి.