Rain Alert : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ముడిపడి, ద్రోణి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిందని తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వివరించింది. ఈ ద్రోణి ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఇది నైరుతి దిక్కుకు విస్తరిస్తుందని పేర్కొంది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి మూడు నుంచి ఐదు డిగ్రీల మేర తగ్గి ఉండొచ్చని అంచనా. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించే అవకాశముందని తెలిపింది. ఇది దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అలాగే అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి వ్యాపించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ రోజు , రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా జోగులాంబ గద్వాల, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇతర జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.