ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్పై టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ గవర్నర్ ఉత్సవ విగ్రహంలా మారారని ఆరోపించారు. వచ్చిన ప్రతి ఫైలుపై గవర్నర్ గుడ్డిగా సంతకం పెట్టేస్తున్నారని.. ఇది సరికాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. కాగ్ నివేదికలు గవర్నర్ వద్దకు వెళ్తే.. వాటి గురించి ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. శ్రీలంక పరిస్థితులు ఏపీలోనూ కనిపిస్తున్నాయని విమర్శించారు.
మరోవైపు ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. ఇప్పటివరకు రూ.7.76 లక్షల కోట్లకు పైగా ఏపీ ప్రభుత్వం అప్పు చేసిందన్నారు. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల ఏపీ దివాళా తీసిందన్నారు. ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఆర్థిక క్రమశిక్షణ లేదని విమర్శలు చేశారు. సంక్షేమం ముసుగులో పేదవాడిని తాగుబోతులుగా మారుస్తున్నారని.. ఏపీలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై కేంద్రం దృష్టి పెట్టాలని.. ఇప్పటికైనా ఏపీలో పరిస్థితులపై కేంద్రం నివేదికలు తెప్పించుకోవాలని హితవు పలికారు.
Adimulapu Suresh: మరొకరి పల్లకిని మోయడమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం