పాక్తో యుద్ధం తర్వాత జరిగిన చర్చల్లో మనం ఒక షరతు పెట్టి ఉండాల్సిందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ సాహిబ్.. మనకు దక్కాలని గట్టిగా అడిగి ఉండాల్సిందన్నారు. కానీ… వారికి ఆ ఆలోచనే రాలేదని చెప్పారు. ఎన్టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో సిక్కుల అవస్థల గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘హేమకుండ్ సాహిబ్ను దర్శించుకోవాలని సిక్కులు కోరుకుంటారు. కానీ అది చాలా కష్టమైన ప్రయాణం.
మేం అక్కడ రోప్వే వేస్తున్నాం. అక్కడంతా మంచుతో కూడుకుని ఉంటుంది. రోప్వే వేస్తే ఇతర భక్తులు కూడా అక్కడికి వెళ్తారు. అలాగే కర్తార్పూర్ కారిడార్ నిర్మించాం.’’ అని మోడీ తెలిపారు.
‘‘మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. భారత్ సరిహద్దుకు అవతల కర్తార్పూర్ సాహిబ్ ఉంది. మనవైపు ఒక టవర్ కట్టారు. టవరెక్కి సిక్కులు దుర్బణిలో చూసి దర్శించుకునేవారు. నేను పంజాబ్లో పనిచేస్తున్నప్పుడు
ఇంత అవమానాన్ని ఎలా సహిస్తున్నారని అనుకునేవాడిని. నేను వచ్చాక పరిస్థితులు మార్చేందుకు ప్రయత్నించాను. ఒక దారి దొరికింది.. ఇప్పుడు సిక్కులు వెళ్లి హాయిగా దర్శించుకుంటున్నారు. చారిత్రక ప్రదేశాలకు చాలా విశిష్టత ఉంటుంది.’’ అని మోడీ తెలిపారు.