CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్‌ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..

Chandrababu

Chandrababu

CM Chandrababu: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన, ఆయన సభలపై అక్కడి రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ సభలను అడ్డుకోవడం సరికాదని, రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. తాను ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చానని గుర్తు చేశారు. అక్కడ కర్ణాటకతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ప్రచారానికి వచ్చారని ఉదాహరణగా పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా ఉందని, గతంలో బీఆర్ఎస్ తమను జాతీయ పార్టీగా ప్రకటించుకుని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ యూనిట్‌ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు చంద్రబాబు… రాష్ట్ర సరిహద్దులు దాటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం సాధారణ విషయమేనని, అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తనకు అర్థం కావడం లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వివిధ దేశాల్లో కీలక పదవులు చేపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో తెలుగువారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారని, అక్కడి చట్టాలు, రాజ్యాంగాల ప్రకారం సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించే వారే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు.

×
×
Ad

తెలంగాణలో పవన్ కల్యాణ్‌పై కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మంచి రాజకీయ సంస్కృతికి నిదర్శనం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు ప్రజా చైతన్యం, ప్రజాసేవ విషయంలో పోటీ పడాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వారి మద్దతు పొందాలని సూచించారు. అనవసర వ్యాఖ్యలతో కొత్త సమస్యలను సృష్టించడం మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయిందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఎవరు ఏ ప్రాంతానికి ఎంత సేవ చేశారో ప్రజలకు బాగా తెలుసని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ వివాదాలకు తెరలేపడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..