హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ ఘటనలో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నవిషయం తెలిసిందే.. అయితే పోలీసులు మాత్రం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కాని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారంటూ.. అందుకు కొన్ని ఆధారాలు చూపించారు. ఆమ్నేషియా పబ్ కు వచ్చిన మెర్సిడేజ్ బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్న ఫోటోలను రఘునందన్ రావు విడుదల చేశారు. ఈ కారులోనే నిందితులు పబ్ కు వచ్చారని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కారులోనే ఎమ్మెల్యే కొడుకు పబ్ కు వస్తున్న ఫోటోలను రఘునందన్ రావు లైవ్ లో రిలీజ్ చేయడం కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. పోలీసుల బెదిరింపులకు ఎవరు భయపడేవారు లేరన్నారు ..మమ్మల్ని కాదు తప్పు చేసిన వారిని భయపెట్టండన్నారు. సీసీ ఫుటేజ్ ఏది..ఎందుకు బయటపెట్టడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారన్నారు. నిందితులను ఇప్పటికే దేశం దాటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ చేసిన వారిని ఎందుకు సీక్రెట్ గా దాస్తున్నారని మండిపడ్డారు. నిర్భయ కేసులో మైనర్ల పేర్లు బయటకు వస్తున్నాయి.. మరి నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ కేసులో నిందితులు మైనరా.. మేజరా.. అన్నది కాదని మండిపడ్డారు. పోలీసులు నిందుతులను బహిరంగంగా అరెస్టు చేసినట్లు ఎక్కడా రాలేదని నిప్పులు చెరిగారు. పోలీసులకు భయపడేవారు ఎవరూ లేరు అన్నారు. ఎందుకు వారిని సీక్రెట్ గా ఉంచుతున్నారని రఘనందన్ ప్రశ్నించారు. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లును రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంను ఎందుకు చేయరు అని అన్నారు. ఈ కేసులో నిందితులెవరో తెలుసుకోవాలనుకుంటున్నామని ఆయన డిమాండ్ చేశారు.