KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- మహేశ్వరంలో బీఆర్ఎస్ జోష్.. గెలుపు మాదేనన్న కేటీఆర్
- కాంగ్రెస్ పాలనలో విధ్వంసమే.. కేసీఆర్ పాలనే బెటర్
- రేవంత్పై ఘాటు విమర్శలు.. 'రెన్యూవల్ సీఎం' అంటూ ఎద్దేవా
- ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వంపై శ్రేణులకు కీలక దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్).. ఎస్.ఐ.ఆర్ (S.I.R.) తో పాటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమనిపించడమే కాకుండా, కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అయినట్లు భావన కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మహేశ్వరంలో మరోసారి సబితా ఇంద్రారెడ్డి గెలుపు తథ్యమని తేలిపోయిందని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలవడం, బీఆర్ఎస్ గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ నలుదిశలా “కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె” అనే ఒకే నినాదం మారుమోగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో విధ్వంసం.. రేవంత్ రెడ్డిపై ‘హిట్లర్ రెడ్డి’ అంటూ ధ్వజం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వికాసం పోయి విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలాయని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ కిట్ పోయి కరెంటు కోతల కాలం వచ్చిందని, రైతు బంధు పోయి ‘రాహుల్ బంధు’ వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పాతర వేసి కుంభకోణాల జాతర నడిపిస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం కేసీఆర్ గారినే తలుచుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఓయూ వద్ద రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేస్తూ, ఎంతోమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోనే కేసీఆర్ పదేళ్ల పాటు ప్రజాసంక్షేమం, ప్రగతిపథాన్ని రెండు జోడెడ్లలా ముందుకు సాగించారన్నారు. పొరపాటునో, గ్రహపాటునో ఇప్పుడు ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అయ్యాడని, ఒక పిచ్చోడి చేతిలో రాళ్లు ఉంటే చుట్టుపక్కల వారికి నష్టమైతే, రాష్ట్రం ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టమని వ్యాఖ్యానించారు. తనకు హిట్లరే ఆదర్శమని రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడని, అందుకే ఆయన పేరు ఇక నుంచి ‘హిట్లర్ రెడ్డి’ అని కేటీఆర్ అభివర్ణించారు.
Also Read
420 అబద్ధాలతో గద్దెనెక్కారు.. కేసీఆర్ చేసిన అప్పులపై వివరణ
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రజనీకాంత్ను మించిన డైలాగులు కొట్టారని, భట్టి విక్రమార్క కమల్ హాసన్ను మించి యాక్టింగ్ చేసి, 420 అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కారని కేటీఆర్ ఆరోపించారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీ కార్డు రెండున్నరేళ్లయినా నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావడం లేదని ఎద్దేవా చేశారు. రైతుబంధు 15 వేలు చేస్తామని చెప్పి, ఇప్పుడు కనీసం యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసిన కేటీఆర్.. తెలంగాణ వచ్చేనాటికి అప్పు 72 వేల కోట్లు ఉంటే, పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు కేవలం 2 లక్షల 80 వేల కోట్లు మాత్రమేనని, అంటే ఏడాదికి 28 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ గారు అప్పు చేసి 1020 గురుకుల పాఠశాలలు పెట్టి ఆరున్నర లక్షల మంది పిల్లలకు అత్యుత్తమ విద్య అందించారని, లక్ష కోట్లతో కరెంట్ కష్టాలు తీర్చారని, కల్యాణలక్ష్మి ద్వారా 14 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేశారని గుర్తు చేశారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారని, కొత్తగా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు తెచ్చారని వివరించారు.
ఢిల్లీకి మూటలు.. కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
రెండున్నరేళ్లలో నాలుగు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంచులు ఇచ్చే ముఖం కూడా ముఖ్యమంత్రికి లేదని, ఆ సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ గారు 72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తే.. రేవంత్ రెడ్డి 30 నెలల్లో 72 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారని, రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు ‘రెన్యూవల్ సీఎం’ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి వేల కోట్లు ఢిల్లీకి పోతున్నా పైసా తిరిగి రావడం లేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానంటున్న రేవంత్కు నిజాయితీ ఉంటే.. రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2500 చొప్పున ఐదేళ్లకు ఇవ్వాల్సిన 1.50 లక్షల రూపాయలు వేయాలని, అలా వేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు.
ఫార్మా సిటీ రద్దుపై మాట మార్చారు.. కార్యకర్తలకు పిలుపు
ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరిట అన్నదమ్ములు విలువైన భూములను దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతో, 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఏడేళ్లు శ్రమించి మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో రైతులను ఒప్పించి 14 వేల ఎకరాల భూమిని సేకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీని ప్లాన్ చేశారన్నారు. నాడు కాంగ్రెస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టి, ఫార్మా సిటీ రద్దు చేసి భూములు రైతులకు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ భూములు వెనక్కి ఇచ్చేది లేదని మాట మార్చారని మండిపడ్డారు. రెండున్నరేళ్లలో ఇంచు భూమైనా రైతులకు ఇవ్వకుండా మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్కే దిక్కులేదని, రాహుల్ గాంధీకి కోపం వస్తే రేవంత్ ఫ్యూచర్ ఏమవుతుందో ఎవరికీ తెలియదన్నారు. చివరగా, కార్యకర్తలే కథానాయకులై కదంతొక్కితే ప్రతి బూత్లో బీఆర్ఎస్కే మెజారిటీ వస్తుందని, ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్ గా తీసుకుని అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. డిజిటల్ రూపంలో పార్టీ సభ్యత్వ నమోదును పెద్దఎత్తున విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చి గౌరవిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..