KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమైన మాజీ సీఎం కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్తో సమావేశంలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Read Also: Inter Colleges: ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపు సందేహమే..
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్పుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్లినవాడు జగిత్యాల ఎమ్మెల్యే అంటూ ఆయన పేర్కొన్నారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేడని.. మధ్యలో పార్టీలోకి వచ్చిన వారు మధ్యలోనే వెళ్ళిపోతారు..వారితో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. మీలో నుంచే ఓ మంచి నాయకుడిని తయారు చేస్తానని.. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా అంటూ సీఎం వ్యాఖ్యానించారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామంటూ నేతలకు సూచించారు. ఇంకా నెరవేరని ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో నెరవేర్చే సత్తా మనకే ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు.