Revanth Reddy on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి రావడం లేదా ఎన్నికల్లో పోటీ చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్ సందర్భంగా పవన్ కు సంబంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారని, అలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ను ఎందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు. “రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అయితే తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వం లేదా ప్రజాప్రతినిధులు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. పవన్ నిర్వహించాలనుకున్న సభకు అనుమతి నిరాకరించిన అంశంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే కారణంతోనే పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఇది రాజకీయ నిర్ణయం కాదని, భద్రతా పరమైన అంశాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని వివరించారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్ష నేతల సభలు, ర్యాలీలకు కొన్ని సందర్భాల్లో అనుమతులు నిరాకరించిన ఘటనలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలు, ర్యాలీలకు కూడా కొన్ని సందర్భాల్లో అనుమతులు లభించలేదని గుర్తు చేశారు. అయితే, పవన్ కల్యాణ్కు దేశ రాజ్యాంగం కల్పించిన అన్ని ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయని, ఆయనకు ఎక్కడైనా వెళ్లే స్వేచ్ఛ ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం కూడా ఆయన హక్కేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

