పాక్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మెన్గా మొహ్సిన్ నఖ్వీ ఎంపికయ్యారు. గత నెలలో పీసీబీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొవడంతో జకా అష్రఫ్ స్ధానాన్ని మొహ్సిన్ నఖ్వీ భర్తీ చేశాడు. అతడు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు. అయితే పీసీబీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నఖ్వీ.. ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాట్లు టాక్. మరోసారి పాకిస్తాన్ జట్టు పగ్గాలని తిరిగి బాబర్ ఆజంకు అప్పజెప్పాలని నఖ్వీ చూస్తున్నట్లు సమాచారం. కాగా, వన్డే వరల్డ్కప్-2023లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. ఈ క్రమంలో అప్పటి పీసీబీ ప్రెసిడెంట్ జకా అష్రఫ్.. పాక్ టెస్టు కెప్టెన్గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్గా షాహీన్ అఫ్రిదికి బాధ్యతలు అప్పగించాడు.
Read Also: Antibiotics: యాంటీబయాటిక్స్ని అనవసరంగా వాడకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది?
అయితే, కెప్టెన్సీలో మార్పులు చోటు చేసుకున్నాక పాకిస్తాన్ టీమ్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొత్త కెప్టెన్లతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలకు వెళ్లిన పాక్.. అక్కడ ఘోర ప్రదర్శన కనబరిచింది. మసూద్ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో వైట్వాష్(3 టెస్టులు) కాగా, అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-4 తేడాతో చేజార్చుకుంది. దీంతో పాక్ క్రికెట్ను తిరిగి గాడిలో పెట్టేందుకు జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ బాబర్ ఆజంకే అప్పజెప్పాలని నఖ్వీ ఆలోచిస్తున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ స్టార్ట్ కానుంది. ఈ లీగ్ తర్వాత పాకిస్థాన్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్తో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతుంది. ఈ సిరీస్ నుంచే తిరిగి పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా బాబర్ బాధ్యతలు చేపడతాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.