China: డ్రాగన్ కంట్రీ చైనా తన బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. ప్రతీ విషయంలో భారత్ని చికాకు పెట్టేందుకే ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇటీవల సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది. ఈ విషయంపై కూడా చైనా తన అల్ వెదర్ ఫ్రెండ్ పాకిస్తాన్కి మద్దతుగా నిలిచి, తన అక్కసును వెళ్లగక్కింది. ఇదిలా ఉంటే చైనా, భారత అవిభాజ్య అంతర్భాగమైన లడఖ్ ప్రాంతంపై అవాకులు చెవాకులు పేలింది.
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370పై మాట్లాడారు. లడఖ్ ప్రాంతాన్ని భారత్ ఏకపక్షంగా కేంద్రపాలి ప్రాంతంగా ఏర్పాటు చేసిందని, దీన్ని మేం గుర్తించమని, సుప్రీంకోర్టు తీర్పు చైనా-భారత్ సరిహద్దు పశ్చిమ భాగ వాస్తవ స్థితిని మార్చలేదని, ఈ ప్రాంతం ఎప్పటికీ మా భూభాగమే అని లడఖ్ గురించి వ్యాఖ్యానించింది.
దీనికి ముందు దాయాది దేశం పాకిస్తాన్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలే చేసింది. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పుని ఏకపక్ష తీర్పని, దీన్ని అంతర్జాతీయ చట్టం గుర్తించదని, దీనికి చట్టబద్ధమైన విలువ లేదని పాక్ వ్యాఖ్యానించింది. దీనిపై చైనా మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తూ పాకిస్తాన్కి మద్దతు తెలిపింది. కాశ్మీర్పై చైనా వైఖరి స్పష్టంగా ఉందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్జీసీ) తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగునంగా శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పింది.