ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.. మరోవైపు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా క్యూలైన్లో టెంట్లు ఏర్పాటు చేశారు.. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.. హుక్కుం పేటలో సిరిమానుకు పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారు భక్తులు..
ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు ముగిసింది. ఐదేళ్లుగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం దుకాణాలకు నేడే చివరి వర్కింగ్ డే. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త మద్యంపాలసీలో భాగంగా.. ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ షాపులను ఇచ్చే విధంగా టెండర్లను ఆహ్వానించింది 26 జిల్లాల నుంచి 3396 షాపులకి 89,882 దరఖాస్తులు వచ్చాయి.
మరో తుపాను గండం పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది తుఫాన్గా మారి.. ఎల్లుండి తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో.. ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షణ చేశారు.. భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు..
ఏపీలో పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభంమైంది.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు ఇలా అంతా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.. ఇక, కంకిపాడులో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల చేశారు.. ఇక, పనులు పూర్తి చేయడానికి డెడ్లైన్ పెట్టారు పవన్ కల్యాణ్.. సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి చేసి.. జనవరి 25న మరికొన్ని పనులు ప్రారంబిద్ధామని సూచించారు.
వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్షించారు.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు అయ్యింది.. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదు అయినట్టు వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది.. మొత్తం 3396 దుకాణాల్లో ఇప్పటివరకు దాదాపు 1500 షాపుల కేటాయింపు పూర్తి అయ్యింది.. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 86 దుకాణాల కేటాయింపు పూర్తి కాగా.. కర్నూలు జిల్లాలో మందకోడిగా లాటరీ.. కేవలం 19 షాపులకే లాటరీ పూర్తి చేశారు.. మిగతా మద్యం దుకాణాల కోసం 26 జిల్లాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి.. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి.. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది..