బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల కోసం బీజేపీ వివిధ కమిటీలు వేసింది. ఆ కమిటీలు చేసిన, చేయాల్సిన పనులపై కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు కిషన్ రెడ్డి సూచనలు చేశారు.
బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తిట్టాలి అంటే చంద్రబాబుని తిట్టాలి.. నిందించాలి అంటే కాంగ్రెస్ పార్టీని నిందించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపాలు, చంద్రబాబు పాపాలు.. మహబూబ్ నగర్కి శాపాలు అంటూ ఆయన విమర్శించారు.
మేడ్చల్ మల్కారిగిరి జిల్లా దుండిగల్ పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్లో ప్రతిపాదించి గవర్నర్కు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
పాకిస్థాన్లో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62 మంది హిందువులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి బుధవారం నాడు మొత్తం 62 మంది హిందూ యాత్రికులు లాహోర్ చేరుకున్నారని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ప్రతినిధి అమీర్ హష్మీ తెలిపారు.
చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్ అయ్యారు. గండిపేట, నెక్నామ్ పూర్లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆరుగురు నిపుణుల కమిటీ నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. ఎన్డీఎస్ఏ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనుంది.
విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి.
లోక్సభ ఎన్నికలకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ తొలి కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం గురువారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో జరగనుంది. 100 నుంచి 125 లోక్సభ స్థానాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లోని కొన్ని సీట్లు కొలిక్కి రావచ్చని అంటున్నారు.
తూప్రాన్లో ఈ ఫ్యామిలీ మిస్సింగ్ కేసులో భారీ ట్విస్ట్ బయటపడింది. చిట్టీల పేరుతో అమాయకుల నుంచి 30 కోట్ల రూపాయలు వసూళ్లు చేసి యాదగిరి పారిపోయినట్లు తెలిసింది. ఈ నెల 5న కుటుంబంతో సహా యాదగిరి కనిపించకుండాపోవడంతో అతని వద్ద చిట్టీలు కట్టిన బాధితులు విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నారు.