Jagananne Maa Bhavishyatthu: జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, మండల ఇంఛార్జులు, జోనల్ కో-ఆర్డినేటర్లు ఇలా మొత్తం యంత్రాంగం కదులుతుందన్న ఆయన.. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 14 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఇక, ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే భావన ప్రజల నుంచే వచ్చిందన్నారు సజ్జల.. అందుకే దీన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేశామన్న ఆయన.. ప్రజల జీవితాల్లో కీలక మార్పు తీసుకుని రావటమే ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. ప్రతి పేద కుటుంబం.. తన కాళ్ల మీద తాను నిలబడే విధంగా చేయడమే వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ టార్గెట్గా వెల్లడించారు. ఒక రాజకీయ పార్టీ ఇంత విస్తృతంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి అని.. 7 లక్షల మంది జగన్ ప్రతినిధులుగా ప్రజల వద్దకు వెళ్తారని తెలిపారు.. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకుని వచ్చిందో ప్రజలకు వివరిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 శాతం మంది ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిపొందారని పేర్కొన్నారు. జగన్ సంక్షేమ పథకాలను అడ్డుకోవటానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు ఈ కార్యక్రమం ద్వారా చెక్ పెట్టనున్నట్టు ప్రకటించారు. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు సజ్జల రామకృష్ణారెడ్డి . జగనన్నే మా భవిష్యత్తు క్యాంపైన్ కు సంబంధించిన ఒక ఏవీని ఈ సందర్భంగా ప్రదర్శశించారు.