Chandrababu: ఏపీ సచివాలయంలో మహిళా- శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మహిళలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై ఆరా తీశారు. 2014లో ప్రవేశ పెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని లాంటి పథకాల స్థితిగతులను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు.
Read Also: PM Narendra Modi: మోడీ పాపులారిటీకి ఎదురులేదు.. గ్లోబల్ లీడర్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్..
ఇక, రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని.. అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 48770 ఉండగా.. మినీ అంగన్వాడీలు 6,837 ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8, 311 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని.. 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12, 496 కేంద్రాలను నిర్మించాలనే లక్ష్యంతో పనులు మొదలు పెట్టగా 2019 నాటికి అందులో 6,119 నిర్మాణాలు పూర్తి అయ్యాయి.. మరో 2800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే, గత ఐదు ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని వెల్లడించారు. అంగన్వాడీల అప్ గ్రెడేషన్లో కూడా పురోగతి లేదని అధికారులు వివరించారు.
Read Also: Tragedy: యూపీలో భారీ వర్షాలు.. ఇంటి పైకప్పు కూలి నలుగురు మృతి
అలాగే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు అని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. 8,455 సెంటర్లలో విద్యుత్తు సదుపాయం లేదని సమీక్షలో వివరించారు. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలి.. పథకాలు అందించడమే కాదని.. వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పని తీరు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.