Ambati Rambabu: అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వికేంద్రీకరణకు బలాన్ని ఇస్తుందన్నారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థం అవుతోందని మంత్రి అంబటి అన్నారు. ఈ మధ్యంతర ఉత్తర్వుల తర్వాత అయినా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు విరామం తాత్కాలికం కాదని శాశ్వతం అని తాను అప్పుడే చెప్పానని.. ఇప్పుడైనా ఇటువంటి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను చంద్రబాబు ఆపాలన్నారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Read Also: Bigg Boss 6: అడ్డంగా దొరికేసిన బిగ్బాస్.. సీజన్ సీజన్కు రూల్స్ మారతాయా?
మరోవైపు పవన్ కళ్యాణ్కు మంత్రి అంబటి రాంబాబు నాలుగు సూటి ప్రశ్నలు వేశారు. మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తావా? గాజువాక నుంచి పోటీ చేస్తావా? కనీసం 25 స్థానాల్లో అయినా పోటీ చేస్తావా? ఎవరితో కలిసి పోటీ చేస్తావ్? అన్న ప్రశ్నలకు పవన్ సమాధానం ఇవ్వాలన్నారు. రౌడీని రౌడీ అంటే అచ్చం రౌడీ లాగే పవన్ రియాక్ట్ అయ్యారని అంబటి ఆరోపించారు. పవన్ వెంట ఎవరైనా వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని ఎద్దేవా చేశారు. ఇళ్లు కూలినట్టు పవన్ ఇప్పటం గ్రామస్తులతో దొంగ సంతకాలు పెట్టించారని.. ఇప్పటం ప్రజలు ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. దొంగ సంతకాలు పెట్టి కోర్టుతో పెనాల్టీ వేయించుకోవటం ఉద్యమం చేయటమా అని నిలదీశారు. ఇప్పటంలో పవన్ అసలు రంగు బయటపడిందన్నారు. అమరావతిలో అసలు రైతులు ఉన్నారా అని మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఐడెంటిటీ కార్డ్ అడిగితే దొంగ రైతులు పారిపోయారని.. 151 సీట్లు వచ్చినపుడు పవన్ వేలు ఎక్కడ పెట్టుకున్నాడని ప్రశ్నించారు. సినిమాల్లో కామెడీ క్యారెక్టర్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు.