Shyamala: హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల తీవ్ర స్థాయిలో స్పందించారు. హోంమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఆమె విమర్శించారు. గతంలో తమ పార్టీ నేతలపై, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు విజయమ్మ, భారతమ్మలపై అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఒక మహిళా హోంమంత్రిగా హుందాగా మాట్లాడాల్సిన బాధ్యత అనితపై ఉందని శ్యామల అన్నారు. అయితే మహిళల పట్ల గౌరవం గురించి మాట్లాడుతున్న వారు గతంలో చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్లు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
టీడీపీ మహిళా నేతలకు ఒక రకమైన గౌరవం, వైసీపీ మహిళా నేతలకు మరో రకమైన వ్యవహారం కనిపిస్తోందని ఆమె ఆరోపించారు శ్యామల… ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా మహిళలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పాలన, ఎన్నికల హామీల అమలు వంటి ముఖ్యమైన అంశాలను పక్కనపెట్టి అధికార పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని శ్యామల విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీల అమలు పరిస్థితిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు తగ్గాయా లేదా అనే విషయంపై హోంమంత్రి సమాధానం చెప్పాలని కోరారు శ్యామల. శాంతిభద్రతల విషయంలో స్పందించాల్సిన ప్రభుత్వం ఇతర అంశాలపై అధిక ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఇక, సాయికృష్ణ కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆయనపై కేసులు ఉన్నాయనే కారణంతో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే, అనేక కేసులు ఎదుర్కొన్న ఇతర నాయకుల విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరిస్తారా అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించేలా పాలన సాగించాలని సూచించారు. తమిళనాడులో పోలీసులు పట్టుకున్న గంజాయి స్మగ్లర్ వ్యవహారంలో కూడా ప్రభుత్వం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అలాగే సుగాలీ ప్రీతి తల్లి ఆవేదన చూసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు సాయికృష్ణ తల్లి ఆవేదనను చూసి ఎలా స్పందిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం, మహిళల భద్రత, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు ఆరే శ్యామల..

