ర’సాలూరి’స్తూనే ఉన్న రాజేశ్వరరావు స్వరకల్పన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాలూరు రాజేశ్వరరావు ఆ రోజుల్లో బాలమేధావి అనే చెప్పాలి. పట్టుమని ఐదేళ్ళు కూడా నిండని వయసులోనే హార్మోనియం మెట్లపై పాటలకు బాణీలు కట్టేవారు. తబలా, మృదంగం కూడా లయబద్ధంగా వాయించేవారు. చిత్రసీమలో సాలూరి వారి బాణీలు మధురామృతం పంచాయి. మూకీ సినిమాల నాడు సైతం సాలూరి వారి స్వరకల్పన సాగింది. టాకీలలో మరపురాని ‘మల్లీశ్వరి’ని మన ముందు ఉంచారు. ‘చంద్రలేఖ’ డ్రమ్స్ మ్యూజిక్ తో యావత్ భారతాన్నీ మురిపించారు. ‘విప్రనారాయణ’ పాటల సవ్వడి ఈ నాటికీ యెదలను మీటేలా చేశారు. ఏది చేసినా అన్నిటా సాలూరు రాజేశ్వరరావు మార్కు వినిపిస్తుంది. అదే ఈ నాటికీ తెలుగువారిని పులకింప చేస్తోంది.
విజయనగరం జిల్లాలోని సాలూరు సమీపంలో శివరామపురం సాలూరు రాజేశ్వరరావు జన్మస్థలం. 1922 అక్టోబర్ 10న రాజేశ్వరరావు జన్మించారు. చిన్నతనంలోనే అన్న హనుమంతరావుతో కలసి తండ్రి సన్యాసి రాజు వద్ద సంగీతాభ్యాసం చేసేవారు. నాలుగేళ్ళ ప్రాయంలోనే కర్ణాటక సంగీతంలోని రాగాలను ఇట్టే పట్టేసేవారు రాజేశ్వరరావు. తండ్రి వద్దనే హార్మోనియం, తబలా నేర్చుకున్నారు. తండ్రి సన్యాసి రాజు ఆ రోజుల్లో విడుదలయ్యే మూకీ సినిమాలకు తెరచెంతనే కూర్చుని హార్మోనియం వాయించేవారు. చిన్నారి రాజేశ్వరరావు సైతం ఆయన విశ్రాంతి తీసుకొనే సమయంలో హార్మోనియం వాయించి అందరినీ అలరించేవారు. ఆయన ప్రతిభ తెలిసిన గ్రామఫోన్ రికార్డింగ్ కంపెనీలు రాజేశ్వరరావుతో పాటలు పాడించాయి. అలా తెలుగువారినందరినీ రాజేశ్వరరావు గానం సైతం ఆకట్టుకుంది. రాజేశ్వరుని ప్రతిభ తెలిసిన వేల్ పిక్చర్స్ అధినేత 1935లో రూపొందించిన ‘శ్రీకృష్ణలీలలు’లో ఆయనతో కృష్ణుని వేషం వేయించారు. అలా చిత్రసీమలో తొలి అడుగు వేసిన రాజేశ్వరరావు ఆపై ‘శశిరేఖా పరిణయం’లో అభిమన్యునిగా నటించి, పాటలతోనూ ఆకట్టుకున్నారు. తరువాత కలకత్తా చేరి అక్కడ ఓ చిత్రంలో నటించే సమయంలో నాటి మేటి గాయకులు కె.ఎల్.సైగల్ వద్ద శిష్యరికం చేశారు. అదే రాజేశ్వరరావు జీవితాన్ని మేలిమలుపు తిప్పింది. అక్కడ ఎందరో పేరొందిన సంగీత దర్శకుల వద్ద హిందుస్థానీ రాగాలనూ ఇట్టే నేర్చుకున్నారు. మద్రాసు చేరాక ‘విష్ణులీల’ అనే చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా పనిచేశారు. ‘జయప్రద’ చిత్రంతో సోలో సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు రాజేశ్వరరావు.
Also Read
జెమినీ వారి ‘బాలనాగమ్మ’ చిత్రానికి ఎమ్.డి పార్థసారథి సంగీత దర్శకులు కాగా, నేపథ్య సంగీతం బాధ్యత సాలూరు రాజేశ్వరరావుకు అప్పగించారు. అందులో నేపథ్య సంగీతం ఆ రోజుల్లో అందరినీ ఆకట్టుకుంది. మరో విశేషమేమంటే, జెమినీ వారి ‘బాలనాగమ్మ’కు పోటీగా వసుంధర సంస్థ ‘శాంత బాలనాగమ్మ’ నిర్మించింది. అందులో బాలవర్ధి రాజు పాత్రలో సాలూరు రాజేశ్వరరావు నటించి, పాటలు పాడారు. అంతేకాదు ఆ చిత్రానికి సంగీతం సమకూర్చారు. జెమినీ వారి బాలనాగమ్మ భారీతనంతో ఆకట్టుకుని విజయం సాధించింది. అయినా శాంత బాలనాగమ్మ పాటలు జనాన్ని రంజింప చేయడం విశేషం. జెమినీ అధినేత వాసన్ కు రాజేశ్వరరావుపై గురి కుదిరింది. దాంతో 1948లో తాను తమిళ,తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ‘చంద్రలేఖ’కు సాలూరు రాజేశ్వరరావునే సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. అందులో డ్రమ్స్ నేపథ్యంలో రూపొందిన పాటలో సాలూరు ప్రయోగించిన బాణీలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
సాలూరు రాజేశ్వరరావు జీవితంలో అన్నిటికన్నా మిన్నగా మేలిమి రత్నంగా వెలుగొందిన చిత్రం వాహినీ వారి ‘మల్లీశ్వరి’. బి.యన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మల్లీశ్వరి’లోని అన్ని పాటలనూ మనసులను ఆకట్టుకొనేలా స్వరపరిచారు రాజేశ్వరరావు. ఈ చిత్రం ద్వారా దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి చిత్రసీమలో ప్రవేశించారు. నటీనటులుగా భానుమతి, యన్టీఆర్ కు సైతం ‘మల్లీశ్వరి’ ఎంతో పేరు సంపాదించి పెట్టింది. ఇక సాలూరు రాజేశ్వరరావు పేరు వినగానే ‘మల్లీశ్వరి’ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాను తలచుకోగానే ఆయన బాణీలే మనసున మెదలుతాయి. రాజేశ్వరరావు అంతకు ముందు, ఆ తరువాత ఎన్ని మధురామృతాలు అందించినా, ‘మల్లీశ్వరి’ అన్నిటిలోకి అతిమధురం అని చెప్పవచ్చు.
‘మల్లీశ్వరి’ తరువాత రాజేశ్వరరావుకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘విప్రనారాయణ’. ఇందులోని పాటలన్నీ అలరించాయి. “ఎందుకోయి తోటమాలీ…అంతులేని యాతన…” పాటను కీరవాణి రాగంలో స్వరపరిచారు. ఈ పాటను విని ఆయనను ఎంతగానో అభిమానించిన శివశక్తిదత్త అదే పనిగా సాలూరు రాజేశ్వరరావును చూడటానికి మద్రాసు వెళ్ళారు. ఆ పాట రాగం పేరు తెలుసుకొని, తన తొలి సంతానానికి ఆ పేరే పెట్టాలని నిర్ణయించారు. అలాగే ఆయన తనకు కొడుకు పుట్టగా ఆయనకు కీరవాణి అని నామకరణం చేశారు. ఆ కీరవాణి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మేటి సంగీత దర్శకునిగా సాగుతున్నారు. అలా అభిమానులను ఎంతగానో తన స్వరకల్పనతో ఆకట్టుకున్నారు రాజేశ్వరరావు.
తన సంగీతంతో అలరించడమే కాదు, వ్యక్తిత్వంలోనూ రాజేశ్వరరావుది ప్రత్యేకమైన బాణీ. తనకు ఎవరైనా మనసుకు కష్టం కలిగిస్తే, వారిచ్చే పారితోషికం కోసం ఎదురుచూడకుండా అక్కడిక్కడే సదరు చిత్రాలను వదిలేసిన సందర్భాలున్నాయి. అలా కేవీ రెడ్డి ‘మాయాబజార్’కు స్వరకల్పన చేస్తూ తనకు నచ్చని అంశాలు చోటు చేసుకోవడంతో ఆ సినిమా వదలుకున్నారు. ఆయన సమకూర్చిన బాణీలను అలాగే పొందుపరచి, మిగిలిన పాటలకు తన మార్కు బాణీలు కట్టారు ఘంటసాల. ఇక పెండ్యాల నాగేశ్వరరావు తన వద్దకు వచ్చి అసిస్టెంట్ గా పనిచేస్తానంటే, వారించి, నీలోనే గొప్ప సంగీతదర్శకుడున్నాడు ప్రయత్నించు అని ప్రోత్సహించారు రాజేశ్వరరావు. ఇక పెండ్యాల నాగేశ్వరరావు సైతం తన స్వరకల్పనతో ఎంతటి మధురాన్ని తెలుగువారికి అందించారో చెప్పక్కర్లేదు. శాస్త్రీయ సంగీతంలోనే అనేకసార్లు మధురామృతం చిలికించిన సాలూరు వారి తరువాతి రోజుల్లో కాలానుగుణంగా తన స్వరకల్పనలో పాశ్చాత్య బాణీలనూ అందిపుచ్చుకొని తెలుగువారిని అలరించారు. నిర్మాతల అభిలాషపై ఉత్తరాది బాణీలను అనుసరిస్తూ స్వరకల్పన చేశారు. ఆయన సంగీతంలో పాటలు రాయాలని తపించిన కవులూ ఉన్నారు. ఆయన స్వరకల్పనలో గానం చేసి తరించాలని ఆశించిన గాయకులూ ఉన్నారు. అందరికీ తగిన గుర్తింపు లభించేలా సాలూరి వారి బాణీలు సాగాయి.
రాజేశ్వరరావు అన్న హనుమంతరావు కూడా కొన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఇక రాజేశ్వరరావు తనయుల్లో వాసూరావ్, కోటి సంగీత దర్శకులయ్యారు. వారిలో కోటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గానూ సాగారు. చివరలో సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన చేసిన “తాండ్ర పాపారాయుడు, అమెరికా అబ్బాయి, ఆదర్శవంతుడు” చిత్రాల్లోనూ కొన్ని పాటలు మధురామృతం కురిపించాయి. 1999 అక్టోబర్ 25న సాలూరు రాజేశ్వరరావు కన్నుమూశారు. ఆయన స్వరాలు మాత్రం ఈ నాటికీ రసాలూరిస్తూనే ఉండడం విశేషం!
తాజావార్తలు
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!