ముగిసిన కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం
రాష్ట్ర మంత్రివర్గం భేటి ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్ను ఆమోదించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్ ప్రతిపాదనలు చర్చించి కేబినెట్ ఆమోదించింది. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలపింది. ఎన్నికల ఏడాది బడ్జెట్ కావడంతో ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై చర్చించిన సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్లో మార్గదర్శనం చేశారు. ఇక, పాలనా పరమైన, రాజకీయ పరమైన అంశాలు కూడా కేబినెట్లో చర్చ జరిగినట్లు సమాచారం కేబినెట్ సమావేశం అనంతరం బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ నాందేడ్ బయల్దేరి వెళ్లనున్నారు కేసీఆర్.. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నాందేడ్ కు పయనం కానున్నారు. BRS బహిరంగ సభలో పాల్గొన నున్నారు కేసీఆర్.
మంత్రి అమర్నాథ్ కు హరిరామజోగయ్య లేఖ
ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇతర పార్టీ నేతలపై విమర్శల దాడి పెంచేశారు. గుడివాడ అమర్నాథ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాపు ఉద్యమనేత చేగొండి హరిరామజోగయ్య. మంత్రి అమర్నాథ్ కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకు..అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు..నీ మంచి కోరి చెబుతున్న అని లేఖలో పేర్కొన్నారు హరిరామజోగయ్య. నిన్న పవన్ కళ్యాణ్ పై ఐటి మంత్రి అమర్ విమర్శలు చేశారు. పవన్ టీడీపీ లో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్, చంద్రబాబు లు లోకేష్ చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారు. కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ సిద్ధం అయ్యారు…వేపగుంట కాపు సామాజిక భవన ప్రారంభోత్సవ సభలో పవన్ పై అమర్నాథ్ కామెంట్ చేశారు. మంత్రి కామెంట్స్ పై జనసేన కౌంటర్ ఎటాక్ చేసింది. కాపు భవన్లో సౌకర్యాలపై నిరసనలు వ్యక్తం చేసింది.
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఇవాళ హైదరాబాద్లో ‘ర్యాలీ-ఈ’ పేరుతో ఎలక్ట్రానిక్ వాహనాల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో 1,000 నుంచి 1,200 ఎలక్ట్రానిక్ వాహనాలు పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు మార్గాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని తెలిపారు. పీపుల్స్ప్లాజా నుండి IMAX రోడ్ రోటరీ మీదుగా ఖైరతాబాద్ VV విగ్రహం KCP జంక్షన్-పంజాగుట్టు-NFCL-SNT జంక్షన్-సాగర్ సొసైటీ-KBR పార్క్ నుండి జూబ్లీ చెక్పోస్ట్ వరకు కేబుల్ వంతెన మీదుగా సైబరాబాద్ పరిమితులు వరకు ఉంటుంది. అంతేకాకుండా.. పీపుల్స్ ప్లాజా నుంచి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.* నల్లగుట్ట జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ఐమాక్స్ నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు. ఆ వాహనాలను రాణిగంజ్, బుద్ధ భవన్ వైపు మళ్లిస్తారు.
* తెలుగు తల్లి ఫ్లైఓవర్/బీఆర్కే భవన్ నెక్లెస్ రోటరీ నుంచి వచ్చే వాహనాలను ర్యాలీ ప్రాంగణంలోకి అనుమతించరు. ఆ వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
భర్తల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రోడ్డెక్కిన భార్యలు
అసోం ప్రభుత్వం బాల్యా వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,250 మంది అరెస్ట్ చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 2026 అస్సాం ఎన్నికల వరకు కొనసాగుతుందని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,074 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. బిస్వనాథ్లో ఇప్పటి వరకు కనీసం 139 మంది, బార్పేటలో 128 మంది, ధుబ్రిలో 127 మంది పట్టుబడ్డారని పోలీసులు ప్రకటించారు. అసోంలో మైనర్లను వివాహం చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పినట్లుగానే ఆయన అటువంటి భర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు రోజులో 24 గంటల పాటూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఎనిమిది వేల మందిపై కేసులు నమోదుచేశారు. అలాగే, 2,258 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ మరో మూడేళ్లపాటు నిర్వహిస్తూనే ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుంటే పోక్సో కింద కేసులు పెడుతున్నారు. అలాగే, ఒకవేళ భర్త వయసు 14 ఏళ్లు ఉంటే అటువంటి బాలుడిని రీఫాం హోంకు తరలిస్తున్నారు. 2026లోగా బాల్య వివాహాలను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, తమ భర్తల అరెస్టుపై భార్యలు ఆందోళన తెలుపుతున్నారు. ఇదే విషయమై ధుబ్రీ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళలను వెళ్లగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.
నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
నిజామాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి కంపించడంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంటిలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కాలేదు. తెల్లవారుజామున భూమి కంపించడంతో అందరూ గాఢ నిద్రలో వున్నారు. భూమినుంచి శబ్దాలు రావడంతో భయాందోళలనతో ఇళ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. అందరూ రోడ్డుమీద ఉండి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు నమోదవుతున్నాయి. భూకంపాలు ఎందుకు నమోదవుతున్నాయని అధికారులు ఆరా తీస్తున్నారు. 2022 డిసెంబర్ 6న జహీరాబాద్ మండలం బిలాపూర్లో భూకంపం సంభవించింది. పెద్ద శబ్ధంతో భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అక్టోబర్ 2, 2021న రామగుండం, మంచిర్యాల మరియు కరీంనగర్లో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 4.0. 2022 అక్టోబర్ 15న ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. 1 నవంబర్ 2021 న, తెలంగాణ రాష్ట్రంలోని కుమురంభీం జిల్లా మరియు మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ ఏడాది నవంబర్ 29న ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ఆవు విషయంలో ఘర్షణ.. ఒకరి మృతి
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో దారుణం జరిగింది. ఆవు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను బలిగొంది. మామ, అతని మేనల్లుడి మధ్య వివాదం నేపథ్యంలో.. మేనల్లుడే తన స్నేహితులతో కలిసి మేనమామను కొట్టి హత్య చేశాడు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా హసన్పూర్ పోలీస్ ఏరియాలోని దౌలత్పూర్ కుటి గ్రామంలో జరిగిన ఓ ఘటనలో మేనల్లుడు ఆవు వివాదం నేపథ్యంలో తన సహచరులతో కలిసి మేనమామను కొట్టి చంపాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫిర్యాదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హాన్లో నివాసముంటున్న విజేందర్కు తన మేనల్లుడు సోనుతో ఆవు విషయంలో గొడవ జరిగింది. వివాదం ఎంతగా పెరిగిపోయిందంటే సోను, అతని సహచరులు మామ విజేందర్ను తీవ్రంగా కొట్టారు. దెబ్బలు గట్టిగా తగలడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
అమ్మా నీకు జోహార్లు.. ఎలా మోసావు తల్లి
సాధారణంగా నవజాత శిశువుల బరువు సగటున మగపిల్లాడు అయితే 3.3 కేజీలు, ఆడపిల్ల అయితే 3.2 కేజీలు ఉంటుంది. బ్రెజిల్కు చెందిన ఓ మహిళ ఇటీవల 7.3 కేజీల బరువు ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు రెండు అడుగుల పొడవు కూడా ఉన్నది. అమెజొనాస్ స్టేట్లో ఈ అరుదైన ఘటన జరిగింది. క్లీడియాన్ శాంటోస్ అనే మహిళకు వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అధిక బరువుతో జన్మించిన ఈ శిశువు, తల్లీ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు.ఆ బిడ్డకు యాంగర్సన్ శాంటోస్ అని పేరు పెట్టారు. 1955లో ఇటలీలో ఒక బిడ్డ 10.2 కేజీలతో పుట్టింది. ఇప్పటి వరకు అత్యంత బరువైన శిశు జననాల్లో అదే రికార్డు. అంతకన్నా చాలా ఎక్కువ బరువుతో పుట్టే భారీ శిశువులను మాక్రోసోమియా (గ్రీకు భాషలో పెద్ద శరీరం అని అర్థం) అని పిలుస్తారు. 4 కేజీల కంటే ఎక్కువ బరువుతో పుట్టే ఏ శిశువునైనా గర్బధారణ వయసుతో సంబంధం లేకుండా మాక్రోసోమిక్ బేబిగా పరిగణిస్తారు. మహిళల్లో గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే అత్యధిక బ్లడ్ షుగర్ వల్ల కడుపులో బిడ్డ 15 నుంచి 45 శాతం వరకు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రోడ్డుప్రమాదంలో మృతి.. కేసీఆర్ సంతాపం
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ మోటార్ సైకిల్ను ట్రక్కు ఢీకొనడంతో శనివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని ఖరస్రోటా వంతెనపై, బింజర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడిని ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సదర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్-ఇన్ఛార్జ్ మానస్ రంజన్ చక్ర తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆస్పత్రిగా తీసుకెళ్లగా.. అతను చనిపోయినట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. ద్విచక్ర వాహనంపై ఉన్న మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, అతని పరిస్థితి విషమంగా ఉన్నందున కటక్ ఎస్సీబీ ఆస్పత్రికి తరలించారని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నేతృత్వంలోని బీఆర్ఎస్లో ఇటీవల చేరిన మాజీ ఎమ్మెల్యే జాజ్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్లోని ఆస్పత్రిలో పర్వేజ్ ముషారఫ్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు పాకిస్తాన్కు చెందిన జియో న్యూస్ రిపోర్టు చేసింది. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముషారఫ్ దుబాయ్లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇక, ముషారఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. మాజీ రాష్ట్రపతి లాహోర్లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.