టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై విచారణ జరపాలి
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. పేపర్ లీక్ ఘటనలో విపక్షాలను ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ లీక్లో ఆర్థిక లావాదేవీలు జరిగాయని హైదరాబాద్ ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. పరువు నష్టం కేసులో కేటీఆర్ నన్ను బెదిరించలేరని, కేటీఆర్ పరువు 100 కోట్లు అని ఎలా నిర్ణయించారు? 100 కోట్లు కట్టి ఆయన్ను ఏమైనా అనొచ్చా? అని ఆయన రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాకుండా.. గతంలో కూడా ఇలానే సిట్లు ఏర్పాటు చేసి కేసులను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. సిట్ కొద్దిమందిని విచారించి కొందరిని వదిలేస్తుందని, అందరినీ విచారించాలని ఈడీకి ఫిర్యాదు చేశామని, ‘ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్ చెప్పారని రేవంత్ అన్నారు. రహస్య సమాచారం కేటీఆర్కు ఎవరు ఇచ్చారు?, తాము సమాచారం ఇవ్వలేదనీ అధికారులు చెబుతున్నారని, మరి దొంగలు ఇచ్చారా? ఆ దొంగలకు కేటీఆర్కు సంబంధం ఏంటని విమర్శించారు రేవంత్ రెడ్డి .
టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం.. ఏం అన్నారంటే?
ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్సీలు ఇవాళ మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు. రాంగోపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైనాట్ 175 అని సీఎం చేస్తున్న వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయి.పులివెందుల నుంచి నేను పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాను.వచ్చే ఎన్నికల్లో పులివెందులలో గెలిచి చంద్రబాబుకు అంకితం చేస్తాం అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 108 నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి టీడీపీ విజయనికి తోడ్పడింది.టీడీపీ విజయం కోసం ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు.టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడుతుందని గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు నాకు ఓటు వేశారు అన్నారు.
దాడిచేసిందెవరు? విచారణలో నిజాలు నిగ్గుతేలాలి
ఏపీలోని అమరావతిలో జరిగిన పరిణామాలు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అమరావతిలో దాడిపై మాట్లాడారు. మూడు రాజధానుల శిబిరంలో ఉన్నవాళ్లపై ఆదినారాయణ రెడ్డి మనుషులే దాడి చేశారు. దళితుల మీద.. మహిళల మీద ఆదినారాయణ రెడ్డి మనుషులు విచక్షణా రహితంగా దాడి చేశారు. అమరావతి రైతుల టెంటులో ఆదినారాయణ రెడ్డి సీఎం జగనుపై ఇష్టానుసారంగా మాట్లాడారు. మూడు రాజధానుల టెంట్ వద్దకు వచ్చి కవ్వించారు. సత్యకుమార్ కారులో కూర్చొని వెకిలిగా నవ్వాడు.అసలైన బీజేపీ ఈ విధంగా చేయదు.చంద్రబాబు డైరెక్షనులో ఆదినారాయణ రెడ్డే ఈ విధంగా చేశారు.అసలు గొడవకు మూలకారణం ఆదినారాయణ రెడ్డే.. అతనేమయ్యాడని అడిగిన మాట వాస్తవమే.సత్యకుమార్ అనవసరంగా ఈ వ్యవహారాన్ని తనపై వేసుకుంటున్నాడు.1200 రోజుల నుంచి మేమేనాడైనా అమరావతి టెంట్ వద్దకు వెళ్లామా..?పథకం ప్రకారం మనుషులతో వచ్చి కవ్వించారు.
ఐపీఎల్ స్టేజిపై ‘నాటు నాటు’ స్టెప్స్ తో అదరగొట్టిన నేషనల్ క్రష్
క్రికెట్ అభిమానుల పండుగ మొదలయ్యింది. ఇప్పటివరకు అందరు కలిసి క్రికెట్ చూసిన వారు ఇక నుంచి మా టీమ్ ఇది.. మా టీమ్ అది అని వార్ మొదలుపెట్టేశారు. హా అర్థమైపోయిందిగా ఐపీఎల్ వచ్చేసింది. ఎంతో గ్రాండ్ గా నేడు ఐపీఎల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రష్మిక, తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. తెలుగు, తమిళ్, హిందీ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్ తో నరేంద్ర మోడీ స్టేడియం మోత మోగిపోయింది. మొట్టమొదటిసారి నాలుగు తెలుగు సాంగ్స్ ఐపీఎల్ స్టేజిపై వినిపించాయి. ఇక వీటికి నేషనల్ క్రష్ డ్యాన్స్ వేయడం విశేషం.. తాను నటించిన పుష్ప సినిమాలోని మూడు సాంగ్స్ కు డ్యాన్స్ వేసిన రష్మిక.. చివర్లో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు పర్ఫెక్ట్ గా స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. గోల్డ్ అండ్ వైట్ కలర్ డ్రెస్ లో రష్మిక అలవోకగా నాటు నాటు స్టెప్ వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంకోపక్క తమన్నా సైతం సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిసి సోషల్ మీడియా ట్రెండింగ్ సాంగ్ ‘టమ్ టమ్’ సాంగ్ కు కాలు కదిపింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఐపీఎల్ పోరు షురూ.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్..
క్రికెట్ ప్రియులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగు సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో ప్రారంభ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే.. గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా ఉన్నారు. అయితే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. ఈ సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్ దిగేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ రెఫరీగా జవగల్ శ్రీనాథ్ వ్యవహరించనున్నాడు. ఈ స్టేడియంలో జరిగిన ఏడు టీ20 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండు సార్లు, ఛేజింగ్ చేసిన టీమ్ ఐదు సార్లు విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 16 ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సింగర్ అర్జిత్ సింగ్ తన టీమ్తో కలిసి బాలీవుడ్ పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆ తర్వాత మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా, ఇండియా క్రష్ రష్మిక మందన్న డ్యాన్స్లతో ఫ్యాన్స్ను అలరించారు.
యూపీలో ఘోరం.. తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డ్ ఘాతుకం
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. బెంగళూర్ లో కారులో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే యూపీలోని మొరాదాబాద్ లో ఓ మహిళపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మొరాదాబాద్ నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న మహిళను తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ గార్డు బలవంతం చేస్తుంటే సూపర్ వైజర్, హౌస్ కీపింగ్ వ్యక్తి నేరానికి సహకరించారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ అధికారి హేమ్ రాజ్ మీనా మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27న మాల్ లో దుస్తులు మార్చుకునే గదిలో డ్రెస్ మార్చుకుంటుండగా, సెక్యూరిటీ గార్డు గదిలోకి బలవంతంగా ప్రవేశించి అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో మాల్ సూపర్ వైజర్, హౌజ్ కీపర్ నిందితుడికి మద్దతుగా బయట గది తలుపు వెలపల నిలబడి ఉన్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ ఘటనపై ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించారని మహిళ పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు బాధిత మహిళ మాల్ లో ఉద్యోగం మానేసింది. అయితే ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఆమెను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించాడు. అత్యాచార బాధితులరాలికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
గొల్లలమామిడాడలో విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్థి మృతి
ఒక్కోసారి విహారయాత్రలు విషాద యాత్రలుగా మారతాయి. ఈత సరదా ప్రాణాలు తీస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ విద్యార్ధి ఈతకు వెళ్ళి దుర్మరణం పాలయ్యాడు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న పేలూరి సాయిదుర్గ (16) కోదండ రామ కోనేరులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గజఈతగాళ్లు సహాయంతో కోనేరులో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహంపై పలుచోట్ల గాయాలు ఉండటంతో తోటి విద్యార్థులపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొట్టి చంపి కోనేరులో పాడేసి ఉంటారని భావిస్తున్నారు.
అమరావతికి మద్దతిస్తే దాడులు చేస్తారా?
రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పై దాడి గర్హనీయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన వై.సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం. అధికారంలో ఉన్న వైసీపీ దాదాగిరీ పరాకాష్టకు చేరిందనే వాస్తవం ఈ దాడితో మరోమారు తేటతెల్లమయింది. ఈ దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలి. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామని రాష్ట్ర పాలకులు సందేశం ఇస్తున్నారా?ఇదే వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానం అయితే మేము కచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం ఇస్తాం. ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారు’ అని వైసీపీ ఎంపీ ప్రకటించారు అంటూ శ్రీ సత్య కుమార్ గారు చెప్పిన మాటలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ శ్రేణులు చేసిన ఈ దాడి ఘటనను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ముఖ్యమంత్రినీ, ఆయన పార్టీనీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పట్టభద్రులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరస్కరించారు.