ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్ వచ్చిన ఆయన.. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం నిర్వీర్యం చేస్తున్నారన్న ఆయన.. ప్రభుత్వ రంగ సంస్థలతో 3లక్షల 25వేల కోట్ల లాభాలు ప్రభుత్వానికి వస్తున్నాయి. నష్టాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.
జాతీయ రహదారులను, 404 రైల్వే స్టేషన్లను, 101 రైళ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు మల్లికార్జున ఖర్గే.. 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అమ్మేస్తున్నారన్న ఆయన.. ఆర్థికవృద్ధి రేటు పెరగడానికి ప్రభుత్వ రంగ సంస్థలే కారణం అని గుర్తుచేశారు.. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయకపోతే మీరు అమ్ముతున్న ఆస్తులు ఎక్కడివి? అని ప్రశ్నించిన ఆయన.. నాగార్జునసాగర్, ఆల్మట్టిని కూడా అమ్మేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రైల్వే లోనే నేను మంత్రిగా ఉన్నప్పుడు 14లక్షల మంది పనిచేసే వారు.. నేడు ఆ సంఖ్య 12 లక్షలకు తగ్గిందన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ.. నరేంద్ర మోడీ చర్యలను అడ్డుకుంటుందని.. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుందని ప్రకటించారు. నిజమని నమ్మించడానికి మోడీ ఒకే అబద్దాన్ని వంద సార్లు చెబుతారంటూ వ్యాఖ్యానించారు మల్లికార్జున ఖర్గే..