ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని రేవంత్ తెలిపారు. కేసీఆర్ నీళ్లు ఇచ్చింది నిజమే అయితే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పాడావు పడిందని ప్రశ్నించారు.
Read Also: AP Congress: ప్రియాంక గాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖ
కేసీఆర్ ను ఆనాడు ఎంపీగా గెలిపించినా… ఈ ప్రాంతానికి చేసిందేం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బక్కోడు కాదు లక్ష కోట్లు, 10వేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు అని దుయ్యబట్టారు. ప్రజలను నమ్మించి మోసం చేసి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు.. ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు అయ్యారని తెలిపారు. కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని విమర్శించారు. ఈ నెల కేసీఆర్ వేసే రైతు బంధు 10వేలే.. వచ్చే నెల కాంగ్రెస్ వస్తే 15వేలు అని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేసి రైతులకు నష్టం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే.. కాంగ్రెస్ రాగానే మిగిలిన డబ్బులు రైతులకు చెల్లిస్తుందని తెలిపారు.
Read Also: Rajasthan Polling: కోపంలో ఓటర్లు.. పోలింగ్ బూతు వైపు కన్నెత్తి చూడని గ్రామస్తులు
రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ బంధు మైనారిటీ బందుకు ఎందుకు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. దళితబందు, బీసీ బందు, మైనారిటీ బందు ఇచ్చే వరకు… బీఆర్ఎస్ నాయకులను గ్రామాలకు రానివ్వకండని పేర్కొన్నారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని రేవంత్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.