వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందడి చేసింది. ఈ ఛాలెంజ్లో కాకతీయ 22వ వారసుడైన కమల్ చంద్రభంజ్ దేవ్ పాల్గొని, స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల పాలనలో తమ పూర్వీకులు ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే గొలుసు చెరువులు తవ్వించారని చెప్పారు.
అడవుల్ని రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ ఒరవడి కేసీఆర్ ప్రభుత్వంలో కనిపిస్తోందని కమల్ చంద్రభంజ్ దేవ్ అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటివి తన మనసుకు చాలా దగ్గరైన పథకాలని వెల్లడించారు. ముఖ్యంగా.. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం చాలా దూరదృష్టితో తీసుకున్న కార్యక్రమమన్నారు. మనం బాగుండటమే కాకుండా మన భవిష్యత్ తరాలు బావుండాలని ఆయన తలపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. యావత్ దేశ ప్రజలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనాలని కమల్ చంద్రభంజ్ దేవ్ కోరారు.
ఈ సంధర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో కమల్ చంద్ర భంజ్ దేవ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు చూపించిన చొరవ కోట్లమందికి స్పూర్తిగా నిలుస్తుందని.. తెలంగాణ పట్ల మీకున్న ప్రేమ, అభిమానం అద్భతమని పేర్కొన్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.