Minister Seethakka: ప్రజాభవన్ లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ MF గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని మంత్రి సీతక్కను ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్కను కోరారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో.. ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి తెలిపారు ప్రతినిధులు. తక్షణమే ఆపరేషన్ కగారును నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read Also: Rohit : ఫ్యామిలీ మ్యాన్ 3 నటుడి అనుమానాస్పద మృతి
ఇక, ఆపరేషన్ కగార్ పై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి.. తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి అన్నారు. మధ్య భారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి.. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయి.. ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి.. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి అని సీతక్క పేర్కొన్నారు.
Read Also: Pahalgam Terror Attack: ఉగ్రవాది హషిమ్ మూసా అప్డేట్ ఇదే.. దర్యాప్తులో ఏం తేలిందంటే..!
అయితే, ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి.. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలనీ ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నాను అని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దని డిమాండ్ చేసింది. ఆ జాతి బిడ్డగా ఆదివాసులకు అండగా నిలుస్తాను.. ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్రభయాందోళనతో ఉన్నారు.. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలి అని కోరారు. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయన్నారు.