పహల్గామ్ ఉగ్ర దాడి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. అంతేకాకుండా స్థానిక వీడియోగ్రాఫర్స్ నుంచి వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియోల్లో ఉగ్రవాదుల కాల్పుల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వీడియోల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Heartbreaking incident in AP: పోషించలేక చిన్నారిని వదిలివెళ్లిన తల్లి.. హృదయాన్ని కదిలిస్తోన్న లెటర్..!
ఇక ఉగ్రవాదుల్లో ఒకరైన హషిమ్ మూసా గురించి కీలక సమాచారాన్ని దర్యాప్తు సంస్థ సేకరించింది. హషిమ్ మూసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండోలో పని చేసినట్లుగా గుర్తించింది. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిపోయినట్లు దర్యాప్తు బృందాలు తేల్చాయి. లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లుగా కనిపెట్టింది. భారీ స్కెచ్లో భాగంగా పహల్గామ్ను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక గతంలో కాశ్మీర్లో జరిగిన మూడు ఉగ్ర దాడుల్లో కూడా హషిమ్ మూసా పాత్ర ఉన్నట్లుగా తేల్చాయి.
ఉగ్రవాదులకు స్థానికులు సహకరిస్తున్నారన్న అనుమానంతో వందల మంది స్థానికులను అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరిలో 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా గుర్తించారు. వీళ్లను విచారించాక.. మూసాకు పాక్ సైన్యంతో సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు ధృవీకరించారు.
ఇది కూడా చదవండి: AP BJP: అమరావతి పర్యటనకు ప్రధాని మోడీ.. ఏపీ బీజేపీ స్పెషల్ ఫోకస్..!
పాకిస్థాన్ పారా కమాండోలు అత్యాధునిక శిక్షణ పొందుతున్నారు. వీరు సంప్రదాయేతర యుద్ధతంత్రం, కోవర్ట్ ఆపరేషన్లలో దిట్టలు. శిక్షణలో వీరిని మానసికంగా.. శారీరకంగా బలోపేతం చేస్తుంటారు. అంతేకాకుండా యుద్ధరంగంలో ఎత్తుగడలు కూడా నేర్పిస్తారు. వీరు అత్యాధునిక ఆయుధాల వినియోగించడం, నేరుగా చేతులతో పోరాడటంలోను నిపుణులు. పహల్గామ్ ఉగ్ర దాడిలో పాల్గొన్న నిందితులు.. గతంలో గగన్నగర్, గదర్బాల్ అడవుల్లో ఆరుగురు స్థానికేతరులు, ఒక డాక్టర్ను, ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన ఘటనల్లో పాల్గొన్నట్లుగా అధికారులు గుర్తించారు. మూసా కూడా ఈ మూడు దాడుల్లోను పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
ఇక ఉగ్రవాదులు పహల్గామ్కు చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ప్రణాళికను అమలు చేసేందుకు కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలి నడకన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేటాడుతున్నాయి. ఇక పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Vijay Devarakonda : కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్