అంగన్వాడీ టీచర్లతో ప్రత్యేకంగా మాట్లాడి.. పిల్లలంతా సర్కారు బడులకు వచ్చేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సర్పంచ్ల నుంచి మొదలుకుని మంత్రుల వరకు అందరినీ బడిబాటలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, పాఠశాల విద్యార్థుల గత విజయాలను వివరించి పిల్లలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని మంత్రి వివరించారు. బషీర్బాగ్లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల డీఈవోలతో బడిబాట కార్యక్రమంపై మంత్రి వీడియోకాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, బడిఈడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదును పెంచడం కోసం జూన్ 3 నుంచి 30వ తేదీ వరకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 3 నుంచి 10 వరకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఎన్రోల్మెంట్డ్రైవ్ను చేపడుతామని చెప్పారు. జూన్ 13 నుంచి బడులు పునఃప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా పండుగ వాతావరణంలో బడులను తెరువాలని సూచించారు.
తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి ప్రభుత్వ బడిపై వారికి భరోసా కల్పించాలన్నారు. బడిబాట సందర్భంగా జూన్ 30 వరకు రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులను సైతం పాఠశాలలకు ఆహ్వానించాలని, మన ఊరు – మన బడి కార్యక్రమంతోపాటు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న విషయాలను వారికి వివరించాలని సూచించారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని సర్కారు బడుల రూపురేఖలు మారబోతున్నాయని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దనున్నామని సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు భారీగా చేరే అవకాశముందన్నారు.
ఎస్సెస్సీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకరోజు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏ కోర్సు చదివితే భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలుంటాయి.. స్కాలర్షిప్లు ఎలా పొందవచ్చనే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
Prabhas: ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. నెక్ట్స్కి ముహూర్తం ఫిక్స్