బస్సు యాత్ర సందర్భంగా పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
అవినీతి పాలనను అంతమొందించి సుపరిపాలన కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రజా గళం సభను విజయవంతం చేయాలని ఉదయగిరి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ నెల 29న వింజమూరులో నిర్వహించనున్న ప్రజాగళం సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలి అని పేర్కొన్నారు. విధ్వంసకర పాలన నుండి ప్రజలను విముక్తి చేయాలి.. ఎన్నికల సమయంలో పని చేసే విషయాలపై క్షేత్ర స్థాయిలో వివరించడంతో పాటు కార్యకర్తలతో కలిసి దిశా నిర్దేశం చేయాలన్నారు.
జనసేన శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా పొత్తు ధర్మానికి భిన్నంగా.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయి నుంచి ముందుకు వెళ్ళాలని సూచించారు.
కృష్ణా జిల్లా గుడివాడ ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు గాడిది కాళ్లైనా పట్టుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, హిందూ సోదరులందరికీ తెలుసు.. ఆయన వెనకాల ఉన్న తెలుగు తమ్ముళ్లకు, పదిమంది జనసైనికులకు తప్ప అంటూ విమర్శలు గుప్పించారు.