Kakarla Suresh: అవినీతి పాలనను అంతమొందించి సుపరిపాలన కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రజా గళం సభను విజయవంతం చేయాలని ఉదయగిరి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ నెల 29న వింజమూరులో నిర్వహించనున్న ప్రజాగళం సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కావలిలో సభ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు వింజమూరు ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్దకు చేరుకుంటారని.. అక్కడ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడతారని తెలిపారు.
ఎనిమిది మండలాల నుంచి వచ్చే నాయకులు కార్యకర్తలు ప్రజానీకానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల కోసం పార్కింగ్ స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. సుమారు 500 మంది టీడీపీ వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి సహకరించాలని కోరారు. అదేవిధంగా సభ అనంతరం అందరికీ భోజన వసతి కల్పించడం జరిగిందని, ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. కనుక ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా సహకరించాలన్నారు. ప్రజాగళం సభ వింజమూరులో అదరాలని, ఈ దెబ్బకు వైసీపీ బెదరాలని, ఉదయగిరి కోటపై టీడీపీ జెండా ఎగరాలని ఈ ప్రాంత ప్రజల కల నెరవేరాలని కాకర్ల సురేష్ ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం, అన్ని శాఖల అధికారులకు ప్రజానీకం సహకరించి సభను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ చంచల బాబు యాదవ్ మాట్లాడుతూ.. రాజారెడ్డి రాజ్యాంగం పోవాలి, అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారైందన్నారు. మద్యం, ఇసుక, మైనింగ్, డ్రగ్స్ , వ్యాపారాలు చేసి వేలకోట్లు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు వికాస్ హరికృష్ణ, కాకర్ల వెంకట్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి యారం కృష్ణయ్య, ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న, కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, ఉదయగిరి మాజీ సర్పంచ్ షేక్ రియాజ్, చీమల తాతయ్య, తదితరులు ఉన్నారు.