బీజేపీ సంక్షేమం,అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భం అందరూ చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. సమసమాజం స్థాపనకు బీజేపీ పాటుపడుతుందన్నారు. మోడీ అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధిలో రెండు, మూడు స్థానాలకు చేరుకుంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టుల పనులకు వర్చువల్ పద్ధతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సబ్స్టేషన్లు, విద్యుత్ ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా సుమారు రూ.6600 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్తో రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై అవగాహనా ఒప్పందం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి తిరుపతి వెళ్తుండగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి సమీపంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో తొలుత ఆయనను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
ఎచ్చెర్లను ప్రజల కోరిక మేరకే శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గం కొనసాగించామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా చిలకలపాలెంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రి ప్రసంగించారు. మత్స్యకారుడైన అప్పలరాజును మంత్రిని చేయడంతో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వచ్చాయన్నారు.
విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం చారిత్రాత్మకమైనదని.. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని మంత్రులకు, అధికారులకు వివరించారు.
విశాఖపట్నంలోని జూపార్క్లో ఉదయం విషాదం చోటుచేసుకుంది. జూపార్క్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నగేష్ అనే జంతు సంరక్షకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఉదయం జూపార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా.. అతనిపై దాడి చేయగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఎలుగుబంటి బోనులో ఉందనుకొని క్లీనింగ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.
టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా, చంద్రబాబును అడుగుతున్నానని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పూర్తి చేసిన అంశాలు, అమలైన పథకాలు వదిలేసి, ఏవేవో మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు.