తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉంటూ జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు తగు ఆదేశాలిస్తున్నారు.
బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. రేపు సెక్రటేరీయేట్లో బీసీ మంత్రులు భేటీ కానున్నారు. రేపు మూడు గంటలకు 8 మంది బీసీ మంత్రులు భేటీ కానున్నారు. బీసీలకు మేలు కలిగేలా సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకోనున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
రేపు సచివాలయంలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రభుత్వ నూతన పాలసీలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానంలో ప్రణాళికలను రచించారు.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే అవకాశమున్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యిందని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు.
అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలోని బందార్లపల్లెలో ఏనుగుల సంచారం వల్ల రాజారెడ్డి అనే రైతు దుర్మరణం పాలైన ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. ఏనుగుల వల్ల రైతు దుర్మరణం చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. మద్యంపై రెండు శాతం సెస్ విధించింది. మద్యం ల్యాండెడ్ రేట్లపై సెస్ విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది. సెస్ ద్వారా సుమారు రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
లిక్కర్ పాలసీపై మాట్లాడే అర్హత జగన్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మద్యం తయారీ అమ్మకాన్ని దగ్గర పెట్టుకుని జగన్ అడ్డంగా దోచుకున్నాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. లిక్కర్లో 40 వేలకోట్లు దోచుకున్నారని, 60 రూపాయలు వున్న క్వార్టర్ బాటల్ 250కి అమ్ముకున్నాడని విమర్శించారు.
ఏపీ సచివాలయంలో రేపు(అక్టోబర్ 16) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
బెజవాడ ఐసీఐసీఐ బ్యాంక్లో సీఐడీ విచారణ ముగిసింది. బ్యాంక్ మేనేజర్ నుంచి సీఐడీ స్టేట్మెంట్ను రికార్డు చేసింది. బ్యాంక్ మాజీ ఉద్యోగులు నరేష్, గోల్డ్ కౌన్సిలర్ మహేష్, నరసరావు పేట బ్రాంచ్ మాజీ ఉద్యోగి కరుణాకర్పై సీఐడీ కేసు నమోదు చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడూ స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షిస్తున్నారు. భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లకు ఆయన సూచనలు చేశారు.