IND vs PAK: 2026 టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూ వివాదం నెలకొంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చేసిన కొన్ని ప్రధాన డిమాండ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఈ అంశం ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వ స్థాయికి చేరడంతో తుది నిర్ణయం కోసం వేచి చూస్తోంది.
లాహోర్ లో జరిగిన సమావేశంలో ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రతినిధులు ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా PCB తన వైఖరిని పునఃపరిశీలించాలని ఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ అంశంపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్తో సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ వివాదానికి ప్రధాన కారణం పాకిస్తాన్, బంగ్లాదేశ్ బోర్డులు చేసిన కొన్ని ప్రతిపాదనలు.
భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ లను తిరిగి ప్రారంభించడంతో పాటు.. భారత్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య ట్రై-సిరీస్ నిర్వహించాలని PCB, BCBలు కోరాయి. అయితే ఈ ప్రతిపాదనలను ఐసీసీ అంగీకరించలేదని తెలుస్తోంది. ద్వైపాక్షిక సిరీస్లపై నిర్ణయం తీసుకునే అధికారం సంబంధిత దేశాల బోర్డులు, ప్రభుత్వాలదే అని ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సెప్టెంబర్ లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన సిరీస్ కూడా అనిశ్చితిలో పడింది.
Brian Bennett: క్యాచ్ ను అలా.. ఎలా? పట్టేశావ్ బ్రో.. వీడియో వైరల్
ఈ పరిస్థితుల మధ్య, ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్ జరిగేలా కనపడడంలేదు. ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించినట్లు వార్తలు రావడంతో టోర్నమెంట్ సన్నాహాల్లో అనిశ్చితి ఏర్పడింది. బంగ్లాదేశ్కు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నదానిపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.