ఒక్క ట్రాక్టర్ చుట్టూ తిరుగుతున్న వ్యవహారం చివరికి పోలీస్ వర్సెస్ పొలిటీషియన్గా మారిపోయిందా? ఎవరికి వారు తగ్గేదే లే అంటూ… ఇగోలకు పోయి విషయ తీవ్రతను పెంచేశారా? నయా పొలిటీషియన్, నేను మోనార్క్ని అనే పోలీస్ ఆఫీసర్ కలిసి ఆ పుణ్యక్షేత్రంలో వివాదాల సెగలు పుట్టిస్తున్నారా? ఎవరా ఇద్దరు? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? భద్రాచలంలో పోలీస్ వర్సెస్ పొలిటికల్ ఎపిసోడ్ రక్తి కట్టిస్తోంది. సర్పంచ్, సీఐ మధ్య మొదలైన యుద్ధం మెల్లిగా పై స్థాయికి చేరడం గురించిన చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఒక డస్ట్ రవాణా ట్రాక్టర్ వ్యవహారం రెండు వర్గాల మధ్య ముదిరి పాకాన పడింది. అది అక్రమమా సక్రమమా అన్న సంగతి కాసేపు అలా ఉంచితే…. ఇద్దరి మధ్య ఇగోనే సమస్యకు మూల కారణం అని చెప్పుకుంటున్నారు స్థానికంగా. నాది పొలిటికల్ పైరవీ పోస్టింగ్ కాదు, ఐ డోంట్ కేర్ అన్నట్టు సీఐ వ్యవహరిస్తుంటే…పేరుకు పంచాయచీ అయినా… భద్రాచలం లాంటి పెద్ద ఏరియాకు నేను కొత్తగా సర్పంచ్ని అయితే… ఆ పోలీసాయనకు అంత లెక్కలేదా అంటూ అట్నుంచి కూడా సీరియస్గా ఉన్నట్టు సమాచారం.
పుణ్యక్షేత్రమైన భద్రాచలం… టౌన్ వాతావరణం ఉండే పెద్ద పల్లెటూరు. దాదాపు 70వేల మంది ఉండే ఈ మేజర్ పంచాయతీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పూనెం కృష్ణ సర్పంచ్ అయ్యారు. అదీకూడా… కాంగ్రెస్ పార్టీ నుంచి కావడం, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు రైట్ హ్యాండ్ కావడంతో… సహజంగానే స్ట్రాంగ్గా ఉన్నారాయన. ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. వాటికి అవసరమైన ఇసుక, కాంక్రీట్ రవాణా కోసం ట్రాక్టర్స్ నడుస్తున్నాయి. అయితే స్థానిక పోలీసులు ఏద ఒక వంకతో ఒక వర్గానికి చెందిన ట్రాక్టర్స్నే టార్గెట్ చేస్తున్నారన్నది సర్పంచ్ వర్గం ఆరోపణ. ఈ క్రమంలోనే… ఓ ట్రాక్టర్ను పోలీసులు ఆపేసి స్టేషన్కు తీసుకుని పోవడం వివాదానికి కారణం అయింది. కానీ… అది ఇసుక కాకుండా క్వారీ డస్ట్ను తీసుకుని వెళ్ళేది కావడంతో పోలీసుల వైఖరి చర్చనీయాంశమైంది. ఇసుక అంటే అక్రమం అంటారుగానీ… క్వారీ డస్ట్ విషయంలో వాళ్ళ అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తోంది సర్పంచ్ వర్గం. లోకల్గా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి వాడుతున్న డస్ట్ను తీసుకెళ్తుంటే పోలీసులకు అభ్యంతరం ఏంటన్నది సర్పంచ్ ప్రశ్న.
అందుకే… స్టేషన్ ఆవరణలో ఉంచిన ట్రాక్టర్ను డైరెక్ట్గా తీసుకువెళ్ళారు సర్పంచ్ మనుషులు. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన సీఐ నాగరాజు అదే ట్రాక్టర్ని తిరిగి స్టేషన్కు తరలించారట. దీంతో వివాదం చినికి చినికి గాలివానగా మారింది. పోలీస్ వర్సెస్ సర్పంచ్ అన్నట్టుగా మారిపోయింది. పొలిటికల్ అండదండలు లేకుండా పోస్టింగ్ తెచ్చుకున్నాను. నా పని నేను చేసుకుని పోతానన్నది సీఐ నాగరాజు వెర్షన్ అట. అదే సమయంలో… నేను మేజర్ పంచాయతీకి సర్పంచ్ని… ఎంత పోలీస్ అయితే మాత్రం నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వరా అన్నది పూనెం కృష్ణ ప్రశ్న. అందుకే మీ సీఐ నన్ను తీవ్రంగా అవమానించారంటూ ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు సర్పంచ్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే…. దీనికి సంబంధించి అధికార పార్టీ నాయకులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారట. ఒక్క వర్గం సీఐని వెనకేసుకుని వస్తుంటే మరోవర్గం మాత్రం గరం గరంగా ఉంది. దీంతో వివాదం మరింత పెరిగి పెద్దదవుతోందని చెబుతున్నారు. నన్ను అవమానించారని సర్పంచ్, నా డ్యూటీ నేను చేశానని సీఐ చెబుతున్న క్రమంలో ఎమ్మెల్యే, పోలీస్ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా సెట్ చేస్తారో చూడాలి.