సోషల్ మీడియాలో పరిచయాల వల్ల కొందరు దేశాల బార్డర్ దాటి తాము ప్రేమించినవారి దగ్గరకు చేరుకుంటున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అంజు- నస్రుల్లా, సీమా హైదర్- సచిన్ మీనాల ప్రేమకథలు సంచలనం రేపాయి. తాజాగా మరో యువతి.. తాను ప్రేమించిన యువకుడి కోసం దేశం దాటి వచ్చింది. శ్రీలంకకు చెందిన ఓ యువతి.. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని యువకుడు.. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారడంతో.. యువతి చిత్తూరు చేరుకుంది. అంతేకాకుండా వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
చిత్తూరు జిల్లా అరిమాకులపల్లెకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి (28) భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి శ్రీలంకకు చెందిన యువతి శివకుమారి విఘ్నేశ్వరి (25)తో 2017లో ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఫేస్బుక్లోనే తమ ఆలోచనలు, ఇష్టాఇష్టాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే యువతి టూరిస్ట్ వీసాపై భారత్కు వచ్చింది. జూలై 8న కొలంబో నుంచి చెన్నైకి చేరుకుంది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి లక్ష్మణ్ చెన్నై వెళ్లాడు. ఆ తర్వాత యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. తన కుటుంబ సభ్యుల అంగీకారంతో జూలై 20న చిత్తూరు జిల్లా వి.కోటలో విఘ్నేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
PMSBY: కేవలం రూ.20లకే రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకత తెలుసుకోండి
దంపతులిద్దరిని తమ ముందు హాజరుకావాలని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు. విఘ్నేశ్వరి వీసా గడువు ఆగస్టు 15తో ముగుస్తున్నందున చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వై.రిశాంత్ రెడ్డి ఆమెకు నోటీసులు జారీ చేశారు. అప్పటిలోగా విఘ్నేశ్వరి శ్రీలంకకు తిరిగి వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. అందుకు విఘ్నేశ్వరి తన దేశానికి తిరిగి వెళ్లేందుకు నిరాకరించింది. ఆమె తన భర్తతో కలిసి జీవించడానికి శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
Naresh: మా బిల్డింగ్ గురించి మా ప్రెసిడెంట్ ను అడగండి.. నన్ను కాదు
విఘ్నేశ్వరి భారత పౌరసత్వం పొందాలని చూస్తున్నారని, విధివిధానాలు, ప్రమాణాలను కూడా ఆమెకు తెలిపినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే, ఓవైపు శాశ్వతంగా భారత్లో ఉండేందుకు అభ్యర్థన చేస్తూనే.. మరోవైపు తిరిగి శ్రీలంక వెళ్లకుండా ఉండేలా తన వీసా గడువును పొడిగించాలని కోరుతూ విఘ్నేశ్వరి దరఖాస్తు చేసుకుంది. అయితే భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు వీలుగా పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు దంపతులకు సూచించారు.