S Jaishankar: భారత్ ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదని, న్యూఢిల్లీ ఎప్పటికీ అణ్వాయుధ బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం అన్నారు. జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుత్తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత, పాక్ మధ్య వ్యవహారం ద్వైపాక్షికం అని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని అన్నారు.
Read Also: Pakistan: భారత్ ‘‘నీటి బాంబు’’తో ఆకలి చావులు తప్పవు.. పాకిస్తాన్ సెనెటర్ ఆందోళన..
జైశంకర్ తన మూడు రోజులు యూరప్ పర్యటనలో భాగంగా జర్మనీలో పర్యటిస్తున్నారు. ‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారతదేశం స్పందించిన వెంటనే నేను బెర్లిన్కు వచ్చాను. ఆ సందర్భంలో నేను మిస్టర్ వాడేఫుల్కు తెలియజేసిన విషయాన్ని మీతో పంచుకుంటాను. భారతదేశం ఉగ్రవాదాన్ని అస్సలు సహించదు. భారతదేశం ఎప్పుడూ అణ్వాయుధ బ్లాక్మెయిల్కు లొంగదు’’ అని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై పోరుకు జర్మనీ భారత్కి మద్దతు తెలియజేసింది. ‘‘ప్రతీ దేశానికి ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఉంది’’ అని జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్ అన్నారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధితులకు సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం కాల్పుల విరమణను తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.