Uddhav Thackeray: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తుల్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే శివసేన( యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్) ఏ అభ్యర్థిని ప్రకటించిన తాము మద్దతు ఇస్తామని చెప్పారు. అక్టోబర్ లేదా నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంవీఏ కూటమి కార్యకర్తల సమావేశంలో ఠాక్రే చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
READ ALSO: Jammu Kashmir Elections: 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు..
గతంలో ఎంవీఏ కూటమి తరుపున ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, శివసేనలో తిరుగుబాటు కారణంగా ఆయన పదవీ కోల్పోయారు. బీజేపీ సాయంతో ఏక్నాథ్ షిండే ప్రస్తుతం సీఎంగా ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘కూటమిలో ఏ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించినా మద్దతు ఇస్తా. నేను నా కోసం పోరాడుతున్నాను. మహరాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాను’’ అని అన్నారు.
ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీ లాజిక్తో కాకుండా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించాలని చెప్పారు. ఎంవీఏ క్యాడర్ స్వప్రయోజనాల కన్నా మహారాష్ట్ర గర్వాన్ని, ప్రయోజనాలను కాపాడటం కోసం పోరాడాలని ఠాక్రే అన్నారు. ఇదిలా ఉంటే, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ‘‘ లౌకిక సివిల్ కోడ్’’ వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఆయన తన హిందుత్వను వదులుకున్నారా..? అని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడుతూ, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఈ బిల్లును ఎందుకు ఆమోదింపచేయలేదు అని ప్రశ్నించారు.