పెగసస్ స్పై వేర్ అంశంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పెగసస్ స్పై వేర్ పై కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక అందిందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అయితే.. మాల్వేర్ గురైనట్లు అనుమానిస్తున్న 29 మొబైల్ పరికరాలను పరీక్షించినట్లు టెక్నికల్ కమిటీ తెలిపిందని, టెక్నికల్ కమిటీ జర్నలిస్టుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసిందని సీజేఐ వెల్లడించారు. తుది నివేదికను సమర్పించేందుకు టెక్నికల్ కమిటీ సమయం కోరడంతో సీజేఐ అంగీకరించారు.
ఈ నేపథ్యంలో.. మొబైల్ పరికరాల పరిశీలనను వేగవంతం చేయడానికి, తుది నివేదికను అందజేయడానికి సాంకేతిక కమిటీకి నాలుగు వారాల సమయం ఇచ్చిన సీజేఐ.. తదుపరి విచారణ జూలైకి వాయిదా వేశారు. టెక్నికల్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. అయితే.. టెక్నికల్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్న సిబల్ వాదనను సొలొసిటరీ జనరల్ వ్యతిరేకించి.. దీన్ని మధ్యంతర నివేదికగా చూడాలని సొలొసిటరీ జనరల్ తెలిపారు.