CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ
- డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- 19 మంది ఎంపీల హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శనివారం రాష్ట్ర ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. సమావేశాన్ని అవి ‘నాటకం’, ‘హాస్యాస్పదమైన ప్రక్రియ’ అంటూ విమర్శించాయి.
కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ వల్ల తమిళనాడుపై పడే ప్రభావం, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం, మిత్రపక్షాలు.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది.
Also Read
19 మంది ఎంపీల హాజరు
ఈ సమావేశానికి విజయ్ మిత్రపక్షాలకు చెందిన మొత్తం 19 మంది ఎంపీలు హాజరైనట్లు సమాచారం. ఇందులో కాంగ్రెస్కు చెందిన 11 మంది ఎంపీలు, సీపీఐ, సీపీఎం, వీసీకే నుంచి ఇద్దరు చొప్పున, ఎండీఎంకే, ఐయూఎంఎల్ నుంచి ఒక్కొక్కరు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం, వీసీకే అధ్యక్షుడు తొల్ తిరుమావళవన్, సీపీఎం నేత సు. వెంకటేశన్, ఎండీఎంకేకు చెందిన దురై వైకో, కాంగ్రెస్ ఎంపీ జోతిమణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. డీఎంకే మిత్రపక్షాలైన ఎంఎన్ఎం, డీఎండీకేలకు చెందిన ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు కూడా సమావేశానికి హాజరయ్యారు. అయితే డీఎంకేకు లోక్సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ.. ఆ పార్టీ సమావేశానికి దూరంగా ఉంది. మరోవైపు అన్నాడీఎంకేకు రాజ్యసభలో నలుగురు ఎంపీలు, దాని మిత్రపక్షమైన పీఎంకేకు ఒక ఎంపీ ఉన్నారు. వీరు కూడా సమావేశానికి హాజరు కాలేదు.
డీఎంకే, అన్నాడీఎంకే బహిష్కరణ
విజయ్ నిర్వహించిన సమావేశానికి డీఎంకే ఎందుకు హాజరు కాలేదన్న ప్రశ్నకు ఆ పార్టీ ఎంపీ కనిమొళి స్పందించారు. పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం కొత్త డీలిమిటేషన్ బిల్లుపై ఇప్పటివరకు రాజకీయ పార్టీలను చర్చలకు ఆహ్వానించలేదని ఆమె తెలిపారు. అసలు బిల్లే పార్లమెంట్లో ప్రవేశపెట్టని సమయంలో దానిపై రాష్ట్రంలో సమావేశం నిర్వహించడం వల్ల ప్రయోజనం లేదని పేర్కొన్నారు. డీఎంకే సీనియర్ నేత ఎ. రాజా కూడా ఈ సమావేశాన్ని విమర్శించారు. విజయ్ ప్రభుత్వం తమకు స్పష్టత లేని అంశంపై చర్చించడం ‘హాస్యాస్పదమైన ప్రక్రియ’గా అభివర్ణించారు.
అన్నాడీఎంకే కూడా ఇదే తరహాలో స్పందించింది. పార్లమెంట్లో కొత్త డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టలేదని, దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి హడావుడిగా ఎంపీల సమావేశం నిర్వహించడం ‘తొందరపాటుతో ఏర్పాటు చేసిన నాటకం’ అంటూ విమర్శించింది.
డీలిమిటేషన్పై తీర్మానం?
ఇదిలా ఉండగా.. విజయ్ మిత్రపక్షాలు మాత్రం డీలిమిటేషన్ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రతిపాదన వల్ల తమిళనాడుకు భవిష్యత్తులో లోక్సభ స్థానాల పరంగా నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. అసెంబ్లీలో డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురావాలని ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. దీంతో ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ అంశంపై తీర్మానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
-
Balloon Gas Cylinder Blast : మియాపూర్లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
-
Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
-
Workplace Harassment: 4 నెలలుగా వీక్లీ ఆఫ్ లేదు.. ఉద్యోగ వేధింపులతో మహిళ సూసైడ్..
-
Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!