ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత కీలకమైన శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోట లోని సతీష్ ధావాన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-9) రాడార్ శాటిలైట్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం ఇది. 1,696 కిలోగ్రాముల EOS-9 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలం నుండి 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉంచనున్నారు.
ఈ గూఢచర్య ఉపగ్రహం లో C-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ అమర్చబడి ఉంది, ఇది అన్ని వాతావరణ పరిస్థితులలో మరియు తక్కువ కాంతిలో భూమి ఉపరితలం యొక్క అధిక-రిజల్యూషన్ చిత్రాలను తీస్తుంది. ఫలితంగా, భారత సరిహద్దులపై మరింత నిఘా వేయవచ్చు. భారతదేశానికి ఇప్పటికే 57 కన్నా ఎక్కువ ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయి. తాజాగా వీటికి EOS-9 ఉపగ్రహం జత కలుస్తుంది.
Read Also: Asaduddin Owaisi: పాకిస్తాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు..
ముఖ్యంగా, పాకిస్తాన్ చైనాల నుంచి వస్తున్న ముప్పుని రాత్రి వేళల్లో కూడా ఈ శాటిలైట్ ద్వారా పసిగట్టవచ్చు. రాత్రి వేళల్లో చొరబాట్లు, ఉగ్రవాదులు, శత్రు సైన్యం మోహరింపును గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటుంది. రాత్రి వేళల్లో పనిచేయలేని కార్టోసాట్-3 శాటిలైట్లో పోలిస్తే EOS-9 మెరుగైన చిత్రాలను అందిస్తుంది. ఇది లో ఎర్త్ ఆర్బిట్ నుంచి అర మీటర్ కంటే తక్కువ రిజల్యూషన్తో చిత్రాలను అందిస్తుంది. ఇటీవల, ప పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ శాటిలైట్ ప్రయోగం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ, “దేశం భద్రతను నిర్ధారించడానికి కనీసం 10 ఉపగ్రహాలు 24 గంటలూ పనిచేస్తున్నాయి. దేశం దాని 7,000 కి.మీ సముద్ర తీర ప్రాంతాలను, మొత్తం ఉత్తర భాగాన్ని పర్యవేక్షించాలి. ఉపగ్రహం మరియు డ్రోన్ సాంకేతికత లేకుండా, దేశం దీనిని సాధించదు.” అని అన్నారు. ఈ ప్రయోగానికి అనేక మంది పార్లమెంట్ సభ్యులు హజరు కానున్నారు.