Court Issues Warrant Against 23 Terrorists: జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ నుంచి బహిష్కరణకు గురైన 23 మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), పాకిస్తాన్ దేశాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం ఇది రెండోసారి. గతంలో 13 మంది ఉగ్రవాదులపై వారెంట్లు జారీ అయ్యాయి. కిష్త్వార్కు చెందిన 36 మంది వ్యక్తులు కొంతకాలంగా ఉగ్రవాదంలో చేరి పాకిస్తాన్కు వెళ్లారు. ఆ తర్వాత, వారిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని కిష్ట్వార్ ఎస్ఎస్పీ ఖలీల్ పోస్వాల్ తెలిపారు.
వీరందరిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటామని ఆయన అన్నారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయబడిందని వెల్లడించారు. ఇప్పటికే వీరి అరెస్ట్ కు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అయిందని, వారిని ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీస్ అధికారులు వెల్లడించారు. యూఏపీఏ చట్టం ప్రకారం వీరందరిపై చత్రు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Ram Charan: ఏజెంట్ సినిమాలో మెగా పవర్ స్టార్… ఊహించని షాక్ ఇచ్చారు
చీనాబ్ లోయ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లోని ఇతర ప్రాంతాల్లో అశాంతిని సృష్టించడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు నిందితులపై అరెస్ట్ వారెంట్ జారీ కోసం చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, డీఎస్పీ విశాల్ శర్మ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత పాకిస్తాన్ లో తలదాచుకుంటూ.. స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసుకుని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ నుంచి వేరు చేయాలని, భారత్ కు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని, వేర్పాటువాదాన్ని పెంచాలని చూస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తమ సహకారాన్ని అందించాల్సిన బాధ్యత పాకిస్థాన్పై ఉందని.. పరారీలో ఉన్న వారిని అరెస్టు చేసేందుకు మేము ఇంటర్పోల్ను భాగస్వామ్యాన్ని కోరామని, పాకిస్థాన్ సహకరించడంలో విఫలమైతే ఈ విషయం ప్రపంచానికి తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. చట్ట ప్రకారం అటాచ్మెంట్ కోసం ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించేందుకు వివిధ రెవెన్యూ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు