Amit Shah: వచ్చే నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా మారాయి. దీంతో పార్టీల అగ్రనేతలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బుజ్జగింపులు మొదలుపెడుతుందని ఆరోపించారు.
రాజ్నంద్గావ్ లో జరిగిన ఈ ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్ అవినీతి ఫుడ్ ఛైన్ రెస్టారెంట్ లాగా ఢిల్లీ వరకు విస్తరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుంచి ప్రతీ పైసా రికవరీ చస్తామని, తలకిందులుగా వేలాదీస్తామని హెచ్చరించారు. గతంలో మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలుగా ఉండేవని, రమణ్ సింగ్ అధికారంలో వచ్చిన 15 ఏళ్లలో ఛత్తీస్గఢ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించిందని ఆయన అన్నారు.
Read Also: Israel-Hamas War: “అలా ఐతేనే”.. ఇజ్రాయిల్ బందీల విడుదలపై ఇరాన్ కీలక ప్రకటన..
ఏప్రిల్ నెలలో బెమెతర జిల్లాలోని బీరాన్ పూర్ గ్రామంలో జరిగిన మతహింసను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ సీఎం భూపేష్ బఘేల్ని విమర్శించారు. మళ్లీ మతపరమైన అల్లర్లకు కేంద్రంగా మారాలని కోరకుంటున్నారా..? అని ప్రజల్ని ప్రశ్నించారు. వేదికపై ఉన్న ఈశ్వర్ సాహును చూపిస్తూ.. బుజ్జగింపు రాజకీయం కోసం భువనేశ్వర్ సాహూను కొట్టి చంపారని, భువనేశ్వర్ సాహూకు న్యాయం చేయాలని అతని తండ్రికి టికెట్ ఇచ్చామని అమిత్ షా అన్నారు.
ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ హయాంలో వివిధ రకాల కుంభకోణాలు జరిగాయని.. రాష్ట్రాన్ని ఢిల్లీ దర్బారుకు ఏటీఎంగా మార్చారని అమిత్ షా ఆరోపించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.