PM Modi: అస్సాం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు అస్సాంను పాకిస్తాన్కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని మోడీ ఆరోపించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, ఎదురుదాడి చేసింది. శనివారం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘అస్సాంను పూర్వపు తూర్పు పాకిస్తాన్లో భాగం చేయడానికి ముస్లిం లీగ్, బ్రిటిష్ వారితో చేతులు కలపడానికి సిద్ధమవడం ద్వారా కాంగ్రెస్ “పాపం” చేసింది’’ అని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, లోక్సభ ఎంపీ మాణికం ఠాగూర్ స్పందించారు. ఈ ఆరోపణల్ని ఎక్స్ వేదికగా ఖండించారు. అస్సాంను పాకిస్తాన్కు అప్పగించే ప్రతిపాదన లేదని ఆయన అన్నారు. అస్సాం హిందూ మెజారిటీ ప్రావిన్స్ అని, విభజన ప్రణాళికలో పాకిస్తాన్ భాగంగా అస్సాం లేదని, అస్సాంలోని సిల్హెల్ జిల్లా ముస్లిం మెజారిటీ ప్రాతం అని ఆయన అన్నారు. ఇప్పుడు సిల్హెల్ జిల్లా బంగ్లాదేశ్లో భాగంగా ఉంది.
Read Also: Railway fare hike: రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన రైల్వే ఛార్జీలు..
అస్సాం మొదటి సీఎం, కాంగ్రెస్ నేత గోపీనాథ్ బోర్డోలోయ్ పేరు మీద ఉన్న గౌహతి ఎయిర్పోర్ట్లో మోడీ కొత్త టెర్మినల్ ప్రారంభించారు. అస్సాంను రక్షించడానికి బోర్డోలోయ్ కాంగ్రెస్ను ధిక్కరించారని ప్రధాని అననారు. అస్సాం గుర్తింపును నాశనం చేసే చర్యల్ని ఆయన వ్యతిరేకించారని, అస్సాం దేశం నుంచి వేరు కాకుండా కాపాడారని ప్రధాని అన్నారు.
అయితే, మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఠాగూర్ స్పందిస్తూ.. జూలై 1947లో బ్రిటీష్ అధికారంలో ఉన్న సిల్హెట్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని, ఆ తర్వాత అది తూర్పు బెంగాల్లో ఆ తర్వాత తూర్పు పాకిస్తాన్లో భాగమైదని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ నిర్ణయం కాదని గోపీనాథ్ బోర్డోలోయ్ ప్రయత్నాల కారణంగా కరీంగంజ్ సబ్ డిస్ట్రిక్ట్ భారత్లోనే ఉంచబడిందని చెప్పారు. ప్రధానిపై విమర్శలు చేస్తూ.. మోడీ శిక్షణ పొందిన ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని, అబద్ధాలు వ్యాప్తి చేయడం ద్వారా జీవిస్తున్నారని అన్నారు.