ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపును వేగవంతం చేసింది భారత ప్రభుత్వం.. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలను కూడా రంగంలోకి దింపింది.. ఇక, మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ.. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని, విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని.. భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.. దీంతో, ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలు) వరకు సమయం ఇచ్చింది రష్యా..
Read Also: Ukraine: మరో భారత విద్యార్థి మృతి
దీంతో.. ఖార్కివ్ను వదిలి వెళ్లాలంటూ భారతీయులకు ఇండియన్ ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.. బస్సులు, రైళ్లు అందుబాటులో లేకపోతే కాలినడకన రండి, పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు వెంటనే వెళ్లాలని సూచించింది.. మరో 4 గంటల్లో ఖార్కివ్ను ఖాళీ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది ఇండియన్ ఎంబసీ.. అయితే, రష్యా పెట్టిన డెడ్లైన్ తర్వాత ఖార్కివ్ను స్వాధీనం చేసుకునే పనిలో రష్యా సేనలు మరింత ముందుకు కదలనున్నట్టు తెలుస్తోంది.. తాము ఇచ్చిన ఆరు గంటల సేఫ్ ప్యాసేజిని వినియోగించుకోవాలని రష్యా సూచిచింది. దీంతో.. విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ముందుకు కదిలేలా చేస్తోంది ఇండియన్ ఎంబసీ.