కొన్ని దేశాల కుట్రల నేపథ్యంలో భారతీయులంతా ఒకటే అనే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మనకంటే ముందు తరం వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చారు.. ఐకమత్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది అన్నారు..
దేశ స్వాతంత్య్రం కోసం.. తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు మంత్రి నారా లోకేష్.. మాకు వద్దు తెల్ల దొర తనం, అనే పాటతో స్వాతంత్ర పోరాటం ప్రారంభమైంది.. దేశ స్వాతంత్రం కోసం, తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందన్నారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు జనసేన అధినేత పవన్కల్యాణ్.. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.. ఇక, కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్.. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు గుర్తు చేసుకోవాలన్నారు..
కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉన్నాయి.. ప్రజల ఆశలను నెరవేరుస్తాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. భారత స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జెండా ఎగురవేసి శుభాకంక్షలు తెలిపిన ఆయన.. ఆ తర్వాత మాట్లాడుతూ.. రాజధాని లేని పరిస్థితి నుంచి 2014లో పాలన ప్రారంభించాం. కొద్దికాలంలోనే నిలదొక్కుకున్నాం. దేశంలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందాం. 2014-19 మధ్య కాలంలో టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచాం అన్నారు..
ఇసుక సరఫరా, నూతన ఉచిత ఇసుక విధానంపై అధికారులతో బుధవారం రోజు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక బుకింగ్ విధానం, రవాణా, సులభమైన లావాదేవీలు, విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష చేసిన సీఎం.. వెబ్ సైట్, యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని ఆదేశించారు.
తిరుమలలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.. ఈ మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. 18వ తేదీన కళ్యాణోత్సవ సేవ కూడా రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, తిరుమలలో పవిత్రోత్సవాలకు బుధవారం రోజు అంకురార్పణ జరిగింది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి.. ఇక, తొలి విడతలో 100 అన్న కాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు.
వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.