భారత నౌకాదళ చరిత్రలో మరో కీలక ఘట్టానికి విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 18 నుండి ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) , ‘మిలాన్ 2026’ విన్యాసాలలో భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఉత్తర అరేబియా సముద్రంలో మొహరించి, శతృదేశం పాకిస్తాన్ నౌకాదళాన్ని డిఫెన్సివ్ మోడ్లోకి నెట్టడంలో ఈ యుద్ధనౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ ఐఎఫ్ఆర్ కోసం అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతంలోకి విక్రాంత్ ప్రవేశించనుంది. ఈ శక్తివంతమైన నౌకను దగ్గర నుండి చూసేందుకు మిత్రదేశాల నౌకాదళాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Budget 2026-27: కేంద్ర బడ్జెట్.. ధరలు తగ్గనున్న 17 రకాల క్యాన్సర్ మందుల ఇవే..
ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, అది భారత నౌకాదళ సత్తాకు నిదర్శనం. 262.5 మీటర్ల పొడవు, 61.6 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక సుమారు 45,000 టన్నుల బరువును మోయగలదు. ఇది గరిష్టంగా 28 నాట్ల వేగంతో ప్రయాణించడమే కాకుండా, సుమారు 1,600 మంది సిబ్బందికి వసతి కల్పిస్తుంది. దీనిపై మిగ్-29కె ఫైటర్ జెట్స్, కామోవ్ 31, , ఎంహెచ్ 60ఆర్ హెలికాప్టర్లతో సహా మొత్తం 30 విమానాలను ఉంచే అవకాశం ఉంది. ఈ నౌకకు 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన మన మొదటి విమానవాహక నౌక ‘విక్రాంత్’ పేరునే పెట్టడం గమనార్హం.
ఈ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఈస్ట్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ‘మిలాన్’ (MILAN) బహుళ పక్ష నౌకాదళ వ్యాయామం కూడా జరగనుంది. ఈ వేడుకకు సుమారు 135 దేశాలకు ఆహ్వానం పంపగా, ఇప్పటికే 60కి పైగా స్నేహపూర్వక దేశాలు పాల్గొనడానికి అంగీకరించాయి. గతంలో 2001లో ముంబైలో, 2016లో విశాఖలో నిర్వహించిన ఐఎఫ్ఆర్ వేడుకల కంటే ఇది మరింత భారీ స్థాయిలో జరగబోతోంది. సముద్ర భద్రతలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ప్రపంచ దేశాల మధ్య వృత్తిపరమైన బంధాలను బలపరుచుకోవడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. భారత రాష్ట్రపతి గారు సుప్రీం కమాండర్ హోదాలో ఈ భారీ నౌకాదళ ప్రదర్శనను సమీక్షించనున్నారు.