Andhra Pradesh Weather: వర్షాకాలంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వర్షాలు దంచికొట్టగా ప్రస్తుతం ఆ బాధ్యతను భానుడు అందుకున్నాడు. దీంతో ఏపీలో వర్షాకాలంలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో తిరుపతిలో అత్యధికంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో 36.9, అనంతపురంలో 34.9, కడపలో 36.2, కాకినాడలో 34.6, కళింగపట్నంలో 33.2, కర్నూలులో 33.4, మచిలీపట్నంలో 35.1, ఒంగోలులో 36.1, నందిగామలో 34.1, గన్నవరంలో 35.2, జంగమేశ్వరపురంలో 35.0, కావలి 35.8, బాపట్ల 35.6, నర్సాపూర్ 34.2, తునిలో 36.1,నంధ్యాల 35.5, ఆరోగ్యవరంలో 32.0 సెంటీగ్రేడ్మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Read Also: Schools Bandh: విద్యార్థులకు అలర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాలలో స్కూళ్లు, కాలేజీలు బంద్
అటు తెలంగాణలోనూ ఎండల తీవ్రత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పొడిగాలులు వీస్తున్నాయని.. రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీల సెల్సియస్కు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. వచ్చే వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు. గత ఏడాది ఆగస్టు నెలలో హైదరాబాద్ నగరంలో 34.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలో ఆగస్టు నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు 2015లో నమోదయ్యాయి. 2015 ఆగస్టులో హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు గుర్తుచేస్తున్నారు.